Monday, August 10, 2020

సామాజిక సంతకం మండల్

 సామాజిక సంతకం మండల్

దళిత చైతన్యం, భావజాల వ్యాప్తి, ఉద్యమ కార్యాచరణ మూలంగా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ గురించి ప్రపంచమంతటా తెలిసింది. అంబేద్కర్‌ గురువు, బహుజనోద్యమాలకు మూల పురుషుడు జ్యోతిబా ఫూలే జీవిత విశేషాలు ఇప్పుడిప్పుడు దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ వరుసలో వారి సరసన నిలబడాల్సిన మరోవ్యక్తి ఉన్నారు. ఆయన గురించి అందరికీ తెలియదు. దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న ఓబీసీలకు మేలు చేసిన మహనీయుడీయన. ఆయనే బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌ (బి.పి. మండల్‌). కేంద్రంలో విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈయన నేతృత్వంలోని మండల్‌ కమిషన్‌ ప్రతిపాదించింది. దాన్ని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం దశాబ్దం తర్వాత అమల్లోకి తెచ్చింది.
బహుజన సమాజానికి ఈయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. బీహార్‌ రాష్ర్టానికి తొలి బీసీ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కేవలం 48 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నా వత్తిళ్లకు లొంగకుండా తన పదవినే త్యాగం చేసిండు. జిల్లా మెజిస్ర్టేట్‌గా, దేశ స్వాతంత్య్రం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీహార్‌ అసెంబ్లీకి, ఆ తర్వాత ఎంపీగా ఎన్నుకోబడ్డారు. శోషిత్‌ దళ్‌ పేరిట పీడిత ప్రజల పార్టీని ఏర్పాటు చేసిండు. జయప్రకాశ్‌ నారాయణ పిలుపు మేరకు పదవుల్ని త్యాగం చేసిండు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల పక్షాన నిలబడ్డందుకు ఇబ్బందులెదుర్కొన్నడు. గుర్తింపునకు నోచుకోకుండా పోయిన ఈయన నిజంగా ఈ దేశ బహుజనుల ఆరాధ్యుడు. ఇంతటి జాతీయ నాయకుడి గురించి అందరికీ తెలియదు. ఆ కొరత తీర్చే ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం.

బి.పి. మండల్‌ యాదవ కులంలో 1918, ఆగస్టు 25న బీహార్‌లోని మాధేపూర్‌ జిల్లాలోని మర్హో గ్రామంలో జన్మించిండు. బాల్యమంతా అక్కడే గడిచింది. ఈయన తండ్రి రాస్‌ బిహారీలాల్‌ మండల్‌ అక్కడ చిన్నపాటి జమిందార్‌. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నట్లయితే తన జమిందారీ రద్దవుతుందని తెలిసి కూడా ఉద్యమంలో పాల్గొన్నడు. జంద్యాలు కేవలం బ్రాహ్మణులే ఎందుకు వేసుకోవాలె, మేము వేసుకుంటామనే ఉద్యమాన్ని లేవనెత్తిండు. బహుజనులకు మెరుగైన విద్యావకాశాలు, అభివృద్ధికి తోడ్పడే సకల చర్యలు చేపట్టాలంటూ ‘మార్లో-మింటో’ కమిటీకి విజ్ఞాపనలు అందజేసిండు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల వల్ల జైలు శిక్ష కూడా అనుభవించిండు. మిత్రులతో కలిసి అఖిలభారత యాదవ (గోపీ) మహాసభను స్థాపించిండు. మండల్‌ కుటుంబం మొత్తం 1920లకు ముందు నుంచే ప్రజోద్యమాల్లో ఉండింది. బి.పి. మండల్‌ పెద్దన్న భువనేశ్వరి ప్రసాద్‌ మండల్‌ 1920లోనే బీహార్‌-ఒరిస్సా శాసనమండలికి జరిగిన తొలి ఎన్నికల్లో సభ్యుడిగా ఎన్నికయిండు. ఈయన కొడుకు జస్టిస్‌ రాజేశ్వర్‌ ప్రసాద్‌ మండల్‌ పాట్నా హైకోర్టులో తొలి బీసీ జడ్జి. బి.పి. మండల్‌ రెండో అన్న కమలేశ్వరి ప్రసాద్‌ స్వాతంత్ర్యోద్యమంలో జయప్రకాశ్‌ నారాయణతో పాటు పాల్గొని 1937లో జైలుకు వెళ్లిండు. ఈయన కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిండు. ఈ రాజకీయ పరంపరను కొనసాగించడమేగాకుండా ఓబీసీలందరూ సదా స్మరించుకొని, నివాళి అర్పించే విధంగా బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌ పనిచేసిండు. ఓబీసీలకు దేశంలో మొట్టమొదటిసారిగా విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే మండల్‌ నివేదికను తయారు చేసిండు. నిజాయితీగా ఉంటూ నిప్పులా బతికిండు. పదవుల్ని తృణప్రాయంగా భావించిండు. చివరికి నమ్మిన సిద్ధాంతం కోసం ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకుండు.


దర్భంగాలో రాజ్‌ పాఠశాలలో చదువుతున్న కాలంలోనే జమిందారు కొడుకయినప్పటికీ బి.పి. మండల్‌ కుల వివక్షను ఎదుర్కొన్నడు. అగ్రవర్ణాల వారితో గాకుండా ఉపాధ్యాయులు ఇతన్ని వేరుగా కూర్చొండబెట్టిండ్రు. తినేప్పుడు కూడా కలువనియ్యక పోయేది. ఆ తర్వాత పాట్నాలో ఇంటర్మీడియట్‌ విద్యనభ్యసించి, కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఇంగ్లీషులో బి.ఎ. ఆనర్స్‌ పాసయిండు. చిన్నతనంలో తాను అనుభవించిన వివక్ష జీవితాంతం అతన్ని వెన్నాడింది. హమేషా పీడితుల పక్షాన నిలబడేలా చేసింది.

1945-51 మధ్యకాలంలో గౌరవ మెజిస్ర్టేటుగా ఉన్నడు. ఫ్రీ ఇండియాలో జరిగిన తొలి సార్వత్రక ఎన్నికల్లో బీహార్‌ అసెంబ్లీకి ఎన్నకయిండు. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కృష్ణ సిన్హా మంత్రి పదవిని ఆఫర్‌ చేసినా కేబినెట్‌ హోదా పదవి కావాలని పట్టుపట్టడంతో అది దక్కలేదు. అనంతరం 1965 ఆ ప్రాంతంలో తన నియోజకవర్గంలోని దళితులు, ముస్లింలపై పోలీసుల దాడిని ఖండించిండు. వారికి నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలో ఆ విషయాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిండు. అంతకు ముందు ముఖ్యమంత్రి కె.బి. సహాయ్‌ పార్టీ ఆదేశాల పేరిట, ఈ అంశాలను అసెంబ్లీలో మట్లాడొద్దని హెచ్చరించినా వినకుండా ప్రజల పక్షంగా నిలబడే నాయకుడు కావడంతో వాటిని ఉల్లంఘించిండు. ఆ తర్వాత ఆత్మను చంపుకొని కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగలేక సంయుక్త సోషలిస్టు పార్టీలో చేరిండు. చేరడమే గాకుండా రాష్ట్రమంతటా పర్యటించి 1967 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 69 సీట్లు సాధించి పెట్టిండు. అంతకు ముందు సభలో ఆ పార్టీ బలం కేవలం ఏడు సీట్లు మాత్రమే. ఇలా బీహార్‌లో తొలి కాంగ్రెసేతర పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో తొలి సారిగా మండల్‌ ఆరోగ్యశాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక్కడ కూడా ఇమడ లేక శోషిత్‌ దళ్‌ పేరిట పీడిత ప్రజల పార్టీని ఏర్పాటు చేసిండు.

తర్వాతి కాలంలో 1968 ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి 22 వరకు మండల్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. మొత్తం 48 రోజులు మాత్రమే ఈయన అధికారంలో ఉన్నడు. ఈయనే తొలి బీహార్‌ ఓబీసీ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సక్రమంగా పాలన చేయకుండా ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ అనేక అడ్డంకులు కల్పించింది. అంతకుముందు మంత్రులు చేసిన అవినీతిపై వేసిన కమిటీ రిపోర్టుని బహిర్గతం చేయొద్దని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి ఇందిరాగాంధీ మండల్‌కు చెప్పినప్పటికీ ఆమె మాటను పెడచెవిన పెట్టిండు. దీంతో అప్పటి వరకు మండల్‌కు ఇస్తున్న మద్దతును కాంగ్రెస్‌ పార్టీ ఉపసంహరించుకుంది. ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఈ సమయంలో గవర్నర్‌ పాత్రపై పెద్దఎత్తున దుమారం రేగింది. అదంతా చరిత్రలో భాగమయింది.

మండల్‌ మరోసారి 1970లో అసెంబ్లీకి ఎన్నకయిండు. అయితే జయప్రకాశ్‌ నారాయణ పిలుపు మేరకు పదవికి రాజీనామా చేసిండు. ఎమర్జెన్సీ సమయంలో మొత్తం జయప్రకాశ్‌ నారాయణ వెంటే ఉన్నాడు. 1977లో పార్లమెంటుకు ఎన్నికయిండు. ఈ దశలోనే అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ బి.పి.మండల్‌ నేతృత్వంలో ఓబీసీల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన చర్యలు సూచించే విధంగా కమిటీని ఏర్పాటు చేసిండు. ఇది జనతాపార్టీ మేనిఫెస్టోలో ప్రధానాంశం. ఈ కమిటీలో హైదరాబాదీ అయినప్పటికీ తర్వాతి కాలంలో బొంబాయిలో ఉంటూ అక్కడి నుంచి పార్లమెంటుకు ఎన్నికైన దళిత జడ్జి రాజారాంభోలే కూడా సభ్యుడిగా ఉన్నారు. మండల్‌ కమిషన్‌ ఏర్పాటుకు 1978లో నిర్ణయం జరిగినా రాష్ట్రపతి ఉత్తర్వులు జనవరి ఒకటి 1979న వెలువడ్డాయి. ఆనాటి నుంచి ఏడాదిలోగా నివేదిక సమర్పించాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అయితే సమయం సరిపోక పోవడంతో ఈ కమిటీ కాల పరిమితిని మరో ఏడాది పొడిగించిండ్రు. చివరికి మండల్‌ కమిటీ నివేదికను అప్పటి హోంమంత్రి జ్ఞాని జైల్‌సింగ్‌కు డిసెంబర్‌ 31, 1980 నాడు మండల్‌ సమర్పించిండు. దేశం నలుమూలలా విస్తృతంగా పర్యటించడమే గాకుండా, విశ్వవిద్యాలయాలు, ప్రొఫెసర్లు, విషయనిపుణులను సంప్రదించి అత్యంత సమగ్రమైన నివేదికను తయారు చేసిండు. ఈ నివేదిక సమర్పించిన 15 నెలలకే 1982 ఏప్రిల్‌ 13న మండల్‌ కన్నుమూసిండు.

మండల్‌ కమిషన్‌ చేసిన 40 సూచనల్లో ఒకటైన విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు 1990 ఆగస్టు 7న అమలు చేస్తూ అప్పటి ప్రధాని విశ్వనాథ్‌ ప్రతా్‌పసింగ్‌ ఉత్తర్వులు జారీ చేసిండు. దీనికి వ్యతిరేకంగా అనేకమంది అలజడులు సృష్టించిండ్రు. బీజేపీ చివరికి ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని రథయాత్రను చేపట్టింది. అందుకే ఆనాటి ఎన్నికలు మండల్‌ వర్సెస్‌ కమండల్‌గా జరిగాయి.
మండల్‌ కమిషన్‌ చేసిన సూచనలు అమలు చేయాలని వి.పి.సింగ్‌ ప్రకటించిన ఉత్తర్వులకు ఈ ఏడాది ఆగస్టులో 25 ఏండ్లు నిండినయి.

మండల్‌ సిఫారసులు అమలు చేయాలనే నిర్ణయం 1990లో జరిగినా అనేక కోర్టు అడ్డంకులెదుర్కొని 1993 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, 2008 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో 27 శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు అమలవుతున్నాయి. ఈ రిజర్వేషన్లు పొందడానికి క్రీమీలేయర్‌తో పాటు సవాలక్ష ఆంక్షలు ఉండడంతో ఇప్పటికీ ఓబీసీలకు సరైన న్యాయం జరగడం లేదు. 22 ఏండ్ల నుంచి రిజర్వేషన్లు అమలవుతున్నా ఇంకా కేంద్రంలో 10 శాతం కూడా ఓబీసీ ఉద్యోగస్తులు లేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీన్ని అధిగమించడానికి మండల్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులన్నింటినీ పూర్తిగా అమలు జరపాలి. అలాగే చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే గాకుండా, బీసీ జనగణన కూడా కేంద్రం ప్రకటించాలి. ఈ జనాభా లెక్కలు బయటికి వచ్చినప్పుడే ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం సరిగ్గా అంచనా వేయడానికి వీలు కాదు. వీటన్నింటి సాధన కోసం కలిసి వచ్చే వారందరినీ భాగస్వాములుగా చేస్తూ ఉద్యమించాల్సిన అవసరముంది. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే మండల్‌కు నిజమైన నివాళి. అంబేద్కర్‌, ఫూలేని గుర్తు చేసుకుంటున్నట్లుగానే మండల్‌ని కూడా గుర్తు పెట్టుకొని, ఆయన ఆశించిన ‘బహుజన రాజ్యాధికారం’ కోసం అందరూ కొట్లాడాలె!

(నేడు బి.పి. మండల్‌ జయంతి) 

Wednesday, July 1, 2020

Dalit Movement and Karamchedu: TURNING POINT




శాహు మహారాజు - మద్యపాన వ్యతిరేకత

దేశంలో మొట్టమొదటిసారిగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి బ్రాహ్మణాధిపత్యాన్ని నిలువరించిన ధీరుడు ఛత్రపతి శాహు మహారాజు. ఇవ్వాళ ఆయన 146వ జయంతి. కొల్లాపూర్‌ (మహారాష్ట్ర) సంస్థానాధీశుడైన ఈయన తన సంస్థానంలో మొదటి సారిగా బహుజనులకు, దళితులకు హాస్టల్‌ సదుపాయం, విద్యావకాశాలు కల్పించిండు. బాలగంగాధర్‌ తిలక్‌ లాంటి హిందూత్వ వాదుల బెదిరింపులకు ఏ మాత్రం భయపడకుండా తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిండు. ప్రచారం చేసిండు. అంబేడ్కర్‌తో కలిసి అనేక దళిత సభల్లో పాల్గొన్నాడు. 1920 జనవరి 31న మూక్‌నాయక్‌ (గొంతులేని వారి గొంతుక) పత్రికను అంబేడ్కర్‌ బొంబాయిలో స్థాపించిండు. దీనికి ఆర్థికంగా అండగా నిబడింది శాహు మహారాజు.
ఈయన నుంచి దేశ ప్రజలు ముఖ్యంగా బహుజనులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది. శాహుమహారాజు తండ్రి అబ్బాసాహెబ్‌ ఘట్గే. ఈయన కొడుక్కు అధికారం దక్కిన తర్వాత బ్రిటీష్‌ వారితో రాయబార సంబంధాలు నెరపడానికి లండన్‌కు వెళ్ళిండు. అక్కడ విందుల్లో మద్యం సేవించడం అవాటయింది. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత కూడా అతిగా తాగడం మూలంగా మార్చి 20, 1886 నాడు మరణించిండు.
తండ్రి తాగుడుకు బానిసై కేవలం 30 ఏండ్ల వయసులోనే చనిపోవడంతో శాహు జీవితాంతం మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిండు. ఒక సారి శాహు గురువు కె.బి.గోఖలే ఒక ప్రస్తావన తీసుకొస్తూ ‘‘గౌరవనీయులైన, మర్యాదస్తులైన మీ నాన్న గారి మిత్రులను మీరు ఆదరించాలి.’’ అని అన్నాడు. దానికి శాహు సమాధాన మిస్తూ ‘‘తెలుసు. ఈ మర్యాదస్తులు మా నాన్నకు ఎలాంటి సాహచర్యం మిచ్చిండ్రో బాగా తెలుసు. వీరి మూలంగానే కదా ఆయన ఆరోగ్యం కరాబయింది. వీళ్ళే కదా ఆయన్ని వ్యసన పరుణ్ణి చేసింది. అవసరం లేదు. వీళ్ళనెవరినీ నేను గౌరవించాల్సిన, ఆదరించాల్సిన అవసరం లేదు’’ అని తేల్చి చెప్పిండు. ఈ విషయాన్ని ‘శాహు చక్రవర్తి - ఎ రాయల్‌ రెవల్యూషనరీ’ గ్రంథంలో ధనంజయ కీర్‌ రాసిండు. ఈ పుస్తకాన్ని బొంబాయిలో పాపులర్ ప్రకాశన్ వారు 1975లో అచ్చేసిండ్రు.
శాహు మహారాజు స్ఫూర్తిని దళిత, బహుజనులు ఆవాహన చేసుకోవాల్సిన సందర్భమిది. కనీసం మద్యపానం విషయంలోనైనా శాహుని స్ఫూర్తిగా తీసుకొని దానికి వ్యతిరేకంగా ప్రచారం చేద్దాం.. -సంగిశెట్టి శ్రీనివాస్

విస్మృత నవలాకారిణి కృపాబాయి


తీగ లాగితె డొంక కదులుతుందంటరు. బాయిల పాతాళగరిగె ఏస్తె ఎప్పుడో మరిచిపోయినయి దొరుకుతయి. కొత్తగా బయటపడుతయి. అట్లనే సాహిత్యంలో ఒక లింక్‌ని వెదుకుతూ ఉంటే అనేక మూలాలు దొరుకుతూ ఉంటాయి. ఈ లింక్‌తో అన్ని సార్లు కాకపోయినా కొన్ని సార్లయినా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. అట్లా తెలియ వచ్చిన మహిళే కృపాబాయి సత్యనాథన్‌. ఈమె ఇంగ్లీషులో ఆత్మకథాత్మక నవల ‘సగుణ- ఎ స్టోరీ ఆఫ్‌ నేటివ్‌ క్రిస్టియన్‌’ పేరిట రాసింది. ఇట్లా ఇంగ్లీషులో ఆత్మకథను నవలగా రాసిన మొట్టమొదటి భారతీయ మహిళ. దేశంలో ఇంగ్లీషులో నవలలు రాసిన రెండో మహిళ. 1874లో జనవరి నుంచి ఎప్రిల్‌ వరకు (నాలుగు సంచికలు) ‘బెంగాల్‌ మ్యాగజైన్‌’లో తోరుదత్‌ ‘బియాంక’ పేరిట ఒక నవలను సీరియల్‌గా ప్రచురించింది. అది అసంపూర్ణ నవల. (మార్కండ్‌ ఆర్‌. పరాంజ్‌పె 2013; 113) అయినప్పటికీ అదే ఇండియాలో మహిళ రాసిన మొదటి ఇంగ్లీషు నవలగా సాహిత్య చరిత్రలో రికార్డయింది. ఇక్కడ మనం చర్చించుకుంటున్న కృపాబాయి సత్యనాథన్‌ 1888 నాటికే నవల రాయడమే గాకుండా ముస్లిం బాలికల కోసం పాఠశాల స్థాపించింది. మిషనరీ పాఠశాలను ఏర్పాటు చేసింది. అందులో బోధించింది. బాలికల విద్యాభివృద్ధికి కృషి చేసింది. వైద్య విద్యను అభ్యసించింది. భర్తతో పాటు మదరాసు, రాజమండ్రి, కుంభకోణం, నీలగిరి తదితర ప్రదేశాలు తిరిగింది. అక్కడ నివాసమున్నది. ఈమె గురించి మొదటి సారిగా భండారు అచ్చమాంబ రాసిన అబలా సచ్చరిత్ర రత్నమాలలో చదివిన. ఆ తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు అచ్చేసిన ‘ఆంధ్ర వాఙ్మయ సూచిక’లో రెండు తెలుగు నవలలు ఈమె రచనలుగా నమోదయ్యాయి. అప్పటి నుంచి ఈమె ఎవరూ అని వెతుకుతూ ఉంటే అనేక కొత్త విషయాలు అందుబాటులోకి వచ్చాయి. అవి మీ ముందుంచుతున్నాను.
    ఇండియాలో మహిళల రచనలను పరిచయం చేస్తూ వచ్చిన సాధికారికమైన పరిశోధక గ్రంథం (రెండు భాగాలు) ‘విమెన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా’. (తెలుగులో దారులేసిన అక్షరాలు) దీనికి సుప్రసిద్ధ విమర్శకులు, ఫెమినిస్ట్‌ ఉద్యమకారులు సూజితారు, కె.లితలు సంపాదకత్వం వహించారు. ఇందులో కృపాబాయి గురించి రెండు పేజీల్లో సమాచారమిచ్చిండ్రు. ఈ పుస్తకం 1993లో అచ్చయింది. అయితే 1902 నాటికే కృపాబాయి నవల ‘సగుణ’ తెలుగు లోకి అనువాదమయిందని భండారు అచ్చమాంబ రాతల వల్ల తెలుస్తుంది. బహుశా ఇంగ్లీషు నుంచి తెలుగు లోకి అనువాదమయిన మొదటి మహిళా రచయిత్రి కృపాబాయియే కావొచ్చు. ఈమె మరో నవల ‘కమల’ 1909లో తెలుగులోకి అనువాదమయింది.
‘సగుణ’ నవలను 1998లో లోకుగె చందాని అనే ఆస్ట్రేలియాలో నివసించే శ్రీలంక వనిత తన సంపాదకత్వంలో వెలువరించింది. దీన్ని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వారు ప్రచురించారు. ఇట్లా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా తెలుగు సాహిత్య చరిత్రకు కొత్తగా జోడించుకోవాల్సిన, మరచిన రచయిత్రి కృపాబాయి సత్యనాథన్‌.
బొంబాయి ప్రెసిడెన్సీలో క్రైస్తవ మతంలోకి మారిన మొట్టమొదటి బ్రాహ్మణ వ్యక్తి హరిపంత్‌ ఖిస్తి, ఆయన భార్య రాధాబాయి. ఈ దంపతులకు 14మంది సంతానం. ఇందులో 13వ సంతానం కృపాబాయి. ఈమె 1862 ఫిబ్రవరి 14 నాడు ఇప్పటి మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో జన్మించింది. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి రాధాబాయి అన్నీ తానే అయి పిల్లల్ని పెంచి పెద్ద జేసింది. ఇంటికి పెద్దవాడయిన భాస్కర్‌ కుటుంబాన్ని కొంత వరకు పోషించిండు. ఇతడు కూడా చిన్న వయసులోనే (1875లో) చనిపోయిండు.
1847 ఆ ప్రాంతంలో సావిత్రిబాయి కొన్ని రోజులు విద్యాభ్యాసం చేసిన అహ్మద్‌నగర్‌లోని మిషనరీ పాఠశాలలోనే ఈమె కూడా మొదట్లో చదువుకున్నది(?). బహుశా తర్వాతి కాలంలో కృపాబాయి పాఠశాలల స్థాపనకు సావిత్రిబాయి పూలె స్ఫూర్తి ఎంతవరకున్నదో భవిష్యత్‌ పరిశోధనల్లో తేలాల్సి ఉన్నది. ఈమె జీవిత చరిత్రకు సంబందించిన కొంత సమాచారం ‘కమల - ఎ స్టోరీ ఆఫ్‌ హిందూ లైఫ్‌’ పుస్తకానికి హెచ్‌.బి.గ్రిగ్‌ అనే మహిళ రాసిన ముందుమాట ద్వారా తెలుస్తోంది. ఈ నవల కృపాబాయి చనిపోయిన తర్వాత వెలువడింది. తనకు స్ఫూర్తిగా నిలిచిన విద్యావంతుడైన సోదరుడు భాస్కర్‌ చనిపోవడంతో కృపాబాయి డిప్రెషన్‌కు గురయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు 13వ యేట బొంబాయిలోని జనానా మిషనరీ పాఠశాలలో చేర్పించారు. అక్కడ ఆమె ప్రతిభను గుర్తించిన మిషనరీ మహిళా డాక్టర్‌ ప్రోత్సహించారు. వైద్య విద్యలో శిక్షణనిప్పించేందుకు ఇంగ్లండ్‌కు పంపేందుకు ఆర్థికంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. అయితే కృపాబాయి శారీరకంగా బలహీనంగా ఉండడంతో ఆ పనిని మిషన్‌ నిర్వాహకులు విరమించుకున్నారు. అయితే అప్పుడప్పుడే మద్రాసులో మహిళలకు సైతం వైద్య విద్యను నేర్పించడం ప్రారంభించడంతో కృపాబాయిని మిషనరీ నిర్వాహకులు అక్కడికి పంపిస్తారు. బొంబాయి నుంచి ఒక్కతే 1878 ఆ ప్రాంతంలో మదరాసుకు చేరుకుంది. ఇక్కడ మద్రాసు మెడికల్‌ కళాశాలలో మొదటి సంవత్సరం ఒక్క కెమిస్ట్రీలో మినహా మిగతా అన్ని సబ్జెక్టులో ఆమె టాపర్‌గా నిలిచింది. అయితే ఒక ఏడాది గడిచిన తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వైద్య విద్యకు స్వస్తి పలికింది. ఈ సమయంలో అక్కడ మిషనరీగా పనిచేస్తున్న రెవరెండ్‌ విలియం థామస్‌ సత్యనాథన్‌ (1830-1892) ఇంట్లో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసిండ్రు. సత్యనాథన్‌ భార్య అన్నా సత్యనాథన్‌ (1832-1924) కూడా కృపాబాయిని సొంత కూతురిలా చూసుకున్నారు. చదువుపట్ల మొదటి నుంచి కృపాబాయికి ఆసక్తి ఉండింది. అందుకే ఆమె ఆ రంగంలో రాణించింది. కృపాబాయికి చదువుపట్ల గల ఆసక్తిని అచ్చమాంబ ఇలా రాసిండ్రు. ‘‘కృపాబాయి బాల్యమునుండియే మిగుల తెలివి గలది యనిపించుకొనెను. ఈమె విద్యనభ్యసించునపుడు తన సహోదరునితోడ గూర్చుండి చదువవలయునని కోరుచుండెను గాని యామె తన వద్ద చదువ కూర్చుండినచో తన తప్పిదములను దిద్దునని యెంచి యట్టి యవమానమున కోర్వ జాలక యామె సహోదరుడామెను దగ్గర జేరనిచ్చెడివాడు కాడు. చిన్నయన్న యట్లు చేసినను కృపాబాయి జ్యేష్ఠ భ్రాత యగు భాస్కరుడు తన ముద్దుల చెల్లెలియం దధిక ప్రీతి కలవాడై యామె విద్యాభ్యాసము చక్కగా జరుపుచుండెను. ఆమెకు సృష్టి సౌందర్యావలోకమునం ధధిక ప్రీతిగాన నామె నిత్యము భాస్కరునితోడ బోయి యనేక పర్వతములను, వనములను, ఉవవనములను దప్పక చూచుచుండెను.’’ (అచ్చమాంబ, భండారు, 1917: 37)
ఇదే సమయంలో రెవరెండ్‌ సత్యనాథన్‌ కుమారుడు సామ్యూల్‌ సత్యనాథన్‌ ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాయంలో నాలుగేండ్లు విద్యాభ్యాసం చేసి ఇండియాకు చేరుకున్నాడు. సామ్యూల్‌, కృపాబాయి ఒకే ఇంట్లో నివసించారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. 1881లో పెండ్లి చేసుకున్నారు. ఇండియాకు చేరుకున్న సామ్యూల్‌ సత్యనాథన్‌ మొదట ఉదకమండలంలోని ‘బ్రీక్స్‌ స్మారక పాఠశాల’లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఇక్కడే హోబర్ట్‌ కళాశాలలో కొన్ని రోజులు ఆయన లెక్చరర్‌గా పనిచేసిండు.
ఉదకమండలంలో ఉన్న సమయంలోనే కృపాబాయి సత్యనాథన్‌ ముస్లిం బాలికల దురవస్థను గమనించి వారి కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించింది. ఆ తర్వాత మిషనరీ తరపున మరో విద్యాలయాన్ని కూడా ఆమె ఏర్పాటు చేసింది. వీటిని నిర్వహించడమే గాకుండా అందులో ఆమె బోధన కూడా చేసింది. సామ్యూల్‌ సత్యనాథన్‌ను అధికారులు బదిలీపై ఉదకమండలం నుంచి రాజమండ్రికి పంపించారు. ఇక్కడ ఆయన ఒక్క సంవత్సరం 1884-85 మధ్యన ఉన్నాడు. రాజమండ్రి నుంచి ఆయనకు తమిళనాడులోని కుంభకోణంకు బదిలీ అయింది. అక్కడ ఒక ఏడాది ఉన్న తర్వాత ఆయన్ని ప్రభుత్వం విద్యాశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నియమించింది. ఇది 1886లో జరిగింది. ఈ అన్ని ప్రదేశాల్లోనూ ఆమె కొంత ఆరోగ్యం, మరికొంత అనారోగ్యంతో సావాసం చేసింది.
ఉదకమండలంలో ఉన్న సమయంలోనే కృపాబాయి తన రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించింది. మొదట అక్కడి వాతావరణాన్ని, ప్రకృతిని వర్ణిస్తూ ‘ది ఇండియన్‌ అబ్జర్వర్‌’, ‘నేషనల్‌ ఇండియన్‌ జర్నల్‌’ మొదలైన పత్రికలకు అనేక వ్యాసాలు రాసింది. భర్త ఉద్యోగం మదరాసుకు మారిన తర్వాత ఆమె ఆరోగ్యం కూడా కొంత కుదుట పడింది. 1888 చివర్లో ఒక బిడ్డకు తల్లి అయింది. అయితే ఆ బిడ్డ ఏడాది తిరగకుండానే చనిపోయింది. దీంతో ఆమె కృంగిపోయింది. అయితే ఈ సమయంలో ఒక స్నేహితురాలితో పాటు భర్త కూడా చిన్న చిన్న వ్యాసాలు, కవిత్వం రాసే బదులు నవల రాయమని ప్రోత్సహించారు. వారి ప్రోత్సహం మేరకు ఆమె మొదట 1887-88 మధ్య కాలంలో ‘మదరాసు క్రిస్టియన్‌ మ్యాగజైన్‌’లో తన కుటుంబ జీవితాన్ని నవలగా రాసింది. ఇది నవలా రూపంలో వెలువడిన తర్వాత ఇండియాతో పాటు విదేశాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. తొలిసారిగా ఒక భారతీయ మహిళ, అదీ మతం మార్చుకున్న రెండో తరం మహిళగా తన అనుభవాలు, జ్ఞాపకాలను ‘సగుణ’ నవలలో రికార్డు చేసింది. భారతీయుల ఆచార వ్యవహారాల గురించి రాసేప్పుడు వాటి గురించి అంతగా తెలియని పాఠకులను సైతం దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థమయ్యే విధంగా నవలను రాసింది. ఇందులో చిన్నప్పుడే అంటే తన ఆరేండ్ల వయసులో (1868)లో చనిపోయిన తండ్రితో పాటు తల్లి రాధాబాయి, ఆమె మిత్రురాలు లక్ష్మి, తన మిత్రురాండ్రు ప్రేమ, హరిణి, మిషనరీ మిసెస్‌ రాబర్ట్స్‌, సోదరుడు భాస్కర్‌ ఇట్లా అనేక సజీవ పాత్రతో నవలను నడిపించింది. అందుకే ఈ నవల గురించి విదేశాల్లో సైతం మంచి గుర్తింపు ఉండింది. ఈ విషయమై కృపాబాయి రాసిన మరో నవల ‘కమల’కు ముందుమాట రాస్తూ గ్రిగ్స్‌ అనే విమర్శకురాలు ఇలా చెప్పిండ్రు. “Her writings seem even better known to English than to Indian readers, some of them having been reviewed in flattering terms in the leading English journals. Her majesty the Queen Empress had recently accepted a copy of “saguna” and was graciously pleased to request that any other work by the authoress should be sent to her.” (Memoirs, Mrs H.B.Grigg, 1894)
ఈమె రెండో నవల ‘కమల’ 1893లో మళ్ళీ ‘మదరాసు క్రిస్టియన్‌ మాగజైన్‌’లో సీరియల్‌గా ప్రచురితమయింది. ఇది 1894 డిసెంబర్‌లో పుస్తక రూపంలో అచ్చయింది. ఈ రెండు నవలలను శ్రీనివాసన్‌, వరదన్‌ అండ్‌ కంపెనీ అనే ప్రచురణ సంస్థ మదరాసులో ముద్రించింది. ‘సగుణ’లో క్రైస్తవ జీవితాలను, ఇండియన్స్‌, విదేశీయుల మధ్యన వైరుధ్యాలు, ఆచార వ్యవహారాలల్లో తేడాను రికార్డు చేస్తే ‘కమల’ నవలలో హిందూ మహిళల జీవితాలను, వారి ఆచారాలను, విద్యావశ్యకతను రికార్డు చేసింది. కృపాబాయి రాసిన వ్యాసాలు, కవిత్వం కూడా పుస్తకంగా అచ్చయింది.
సామ్యూల్‌ సత్యనాథన్‌ ఇంట్లో అందరూ రచయితలే కావడం విశేషం.లూ సామ్యూల్‌ తండ్రి డబ్ల్యు.టి. సత్యనాథన్‌ రచనలు చేసిండు. సామ్యూల్‌ (1861-1906) ‘క్రిస్టియన్‌ పేట్రియాట్‌’ అనే పత్రికకు సంపాదకత్వం వహించడమే గాకుండా, కొన్ని పుస్తకాలు రాసిండు. సామ్యూల్‌ తల్లి అన్నా సత్యనాథన్‌ (1832-1894) కూడా రచనలు చేసింది. అట్లాగే సామ్యూల్‌ రెండో భార్య కమల సత్యనాథన్‌ (1879-1950) ‘హిందూ హిరోయిన్‌ శకుంతల’ పేరిట రచనలు చేసింది. సామ్యూల్‌-కమల సత్యనాథన్‌ల సంతానం పద్మినీ సేన్‌ గుప్త (1906-1988) కూడా గొప్ప రచయిత్రి.
కృపాబాయికి ఇష్టమైన కవి వర్డ్స్‌ వర్త్‌. ఈమె వర్డ్స్‌వర్త్‌తో పాటు, టెన్నిసన్‌, లాంగ్‌ఫెలో, బ్రౌనింగ్‌, లూయిస్‌ మోరిస్‌, జార్జ్‌ ఎలియట్‌, మిల్టన్‌, రుడ్యర్డ్‌ కిప్లింగ్‌ తదితరుల రచనలు విరివిగా చదివింది. అందుకే ఆమె తన రచనలను చక్కగా తీర్చి దిద్దగలిగింది. సంస్కరణ భావాల దృష్ట్యా ఇంగ్లీష్‌ సాహిత్యంలో ఇప్పటికీ ఈమెను ‘నూతన మానవి’గా పేర్కొంటారు.
ఇక ఈమె తెలుగు వారికి ఎట్లా దగ్గరయ్యిందో చూద్దాం. బండారు అచ్చమాంబ 1905లో చనిపోయింది. ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’ మొదటి భాగం అచ్చమాంబ బతికుండగానే 1901లో అచ్చయింది. రెండో సంపుటం ఎప్పుడు అచ్చయిందో తెలియదు. అయితే ఎన్‌.వి.కృష్ణ అండ్‌ కో వారు 1913లో మొదటి భాగాన్ని మూడు వేల కాపీలతో పునర్ముద్రించారు. ఈ కంపెనీలో భాగస్వామి అయిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు రెండో భాగాన్ని 1917లో ప్రచురించాడు. ఈ పుస్తకం ‘ఉత్తమ గ్రంథాలయం’ ప్రచురణ సంస్థ తరపున వెలువరించారు. ‘సగుణ’ గురించి అచ్చమాంబ రాస్తూ ‘‘1886వ సంవత్సరమునందామె భర్తను చెన్నపట్టణమునకు మార్చిరి. యచటికి వచ్చిన యనంతరము పత్రికకు వ్యాసములు వ్రాయుటలోనే కాలము గడపక, ప్రబంధ రచన చేయుట మంచిదియని యామె భర్త సూచించెను. అందుపై నామె తన బాల్యము నందలి యనేక సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొని వానితో దన కల్పనను గూర్చి ‘సగుణమ్మ’ యను ప్రబంధమును నొకదాని నింగ్లీషునందు వ్రాసెను. అది ప్రస్తుతము తెలుగునందు భాషాంతరీకరింపబడి యున్నది’’ అని చెప్పింది. అంటే 1905 కన్నా ముందే ఈ పుస్తకం తెలుగులో కూడా అచ్చయింది.
అట్లాగే ఆంగ్లంలో ‘కమల’ నవల 1894లో అచ్చయింది. దీన్ని కూడా తెలుగులోకి తర్జుమా చేసిండ్రు. ఈ అనువాద నవలను 1909లో మదరాసులోని ఎస్‌పిసికె ప్రెస్‌లో అచ్చేసిండ్రు. మొత్తం 143 పేజీల్లో ఈ నవ అచ్చయింది. అయితే ఈ రెండు నవలల మూల ప్రతులు మాత్రం లభ్యం కావడం లేదు. అవి దొరికినప్పుడు మాత్రమే వాటిని ఎవరు తర్జుమా చేసిండ్రో తెలుసుకునేందుకు అవకాశముంటుంది. ఇందులో ‘కమల’ నవల తెలుగు ప్రతి బ్రిటీష్‌ లైబ్రరీలో ఉన్నట్లు అక్కడ పనిచేసిన బార్నెట్‌ అనే అతను రాసిండు. (ఎ కేటలాగ్‌ ఆఫ్‌ తెలుగు బుక్స్‌ 1912; 90).
అచ్చమాంబ జీవితానికి కృపాబాయి సత్యనాథన్‌ జీవితానికి చాలా సారుప్యాలున్నాయి. ఇద్దరు కూడా స్వయంకృషితో పట్టుబట్టి విద్యాభ్యాసం చేసిండ్రు. ఇద్దరు కూడా తమ సమకాలీన జీవితాలను సృజనాత్మకంగా సైతం రికార్డు చేసిండ్రు. ఇద్దరు కూడా దాదాపు ఒకే వయసులో మరణించారు. ఇద్దరూ తమ పిల్లలను చిన్నతనంలోనే కోల్పోయిండ్రు. అచ్చమాంబ 1905 జనవరి 18న 30వ యేట మరణించగా, కృపాబాయి సత్యనాథన్‌ 32వ యేట ఆగస్టు 8, 1894 నాడు మదరాసులో మరణించింది. ఈమె సమాధి మదరాసులోని పరశువాకంలోని సెమిట్రీలో ఉన్నది.
కృపాబాయి రాసిన రచనలను అచ్చమాంబ ప్రబంధాలు అని రాసింది. అంటే అప్పటికి నవల అనే పదం ఖాయం కాలేదు. ఇట్లా తెలుగు సాహిత్యములో మొదటి సారిగా ఇంగ్లీషు నుంచి ఒక మహిళ రచనలు తర్జుమా అయిన తీరుని చరిత్రలో శాశ్వతంగా ముఖ్యంగా మహిళా సాహిత్య చరిత్రలో రికార్డు చేయాల్సిన అవసరమున్నది.

-సంగిశెట్టి శ్రీనివాస్

ఆధునిక మహిళా సాహిత్యానికి ఆద్యులు గుండు అచ్చమాంబ!


సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశీలన, పరిశోధన మారుతూ ఉంటుంది. తెలుగు సాహిత్యం అందుకు మినహాయింపు కాదు ఇన్నాళ్ళు అంతగా పట్టింపులో లేని మహిళా, దళిత సాహిత్యాలను విశ్వవిద్యాయాల్లోని అధ్యాపకులు ఇప్పుడు కొత్తగా పట్టించుకుంటున్నారు. గతంలో మాదిరిగా పౌరాణిక, ఆధ్యాత్మిక సాహిత్యంపై గాకుండా ఆధునిక సాహిత్యంపై ఎక్కువ పరిశోధనకు అవకాశం కల్పిస్తున్నారు. శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ ఆచార్యుల దగ్గర విద్యార్థులు ఆయా అంశాలపై కొత్తగా పరిశోధనలు చేస్తున్నారు. విస్మరణకు గురైన లేదా చరిత్రకెక్కని విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. వారందరికీ అభినందనలు. కొంత మంది ఆచార్యులు సైతం అక్కడక్కడ కొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నారు. అయితే వీరందరికీ భిన్నంగా రిటైరైన తర్వాత మరింత ఎక్కువగా పరిశోధన చేస్తున్న వారు ఆచార్య కాత్యాయని విద్మహే గారు.

నిరంతరం పరిశోధన చేస్తూ కొత్త ఆవిష్కరణలు చేస్తూ, విషయాలను కొత్త కోణంలో ఆవిష్కరించే వారిలో ముందువరుసలో ఉన్నవారు ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మహే గారు. రిటైరైన తర్వాత అటు దళిత సాహిత్యాన్ని, ఇటు స్త్రీల సాహిత్యాన్ని నూతన అంశాలతో పున: ఆవిష్కరిస్తున్నారు. అందుకు ముందుగా మేడమ్‌కు ధన్యవాదాలు.
కాత్యాయని విద్మహే గారి గౌరవ సంపాదకత్వములో వెలుడుతున్న ‘దగోదావరి’ అంతర్జాల సాహిత్య మాసపత్రికలో ‘ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర’ పేరిట వ్యాసాల పరంపరను రాస్తున్నారు. ఇందులో ఇంతవరకు తెలుగు సాహిత్యం అంతగా పట్టించుకోని విషయాలను, విస్మరణకు గురైన అంశాలను, ప్రధానంగా మహిళా దృక్కోణంలో చరిత్రకెక్కిస్తున్నారు. అందులో భాగంగానే మేడమ్‌ ‘గుండు అచ్చమాంబ’ గురించి వివరంగా రాసిండ్రు. ఈ వ్యాసం బహుశా ఏప్రిల్ నెలలో అచ్చయి వుంటుంది. వ్యాసంలో అచ్చమాంబ రచనలను పేర్కొన్నారు. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో మొదటి మహిళగా ఆమెను గురించి పరిచయం చేసిండ్రు. అంతకుముందు ఒకరిద్దరు రచయిత్రులున్నా వారి రచనలు ఒకటి అరా తప్ప పెద్దగాలేవు. అచ్చమాంబ గురించి రాసిన వ్యాసం ముగింపులో కాత్యాయని విద్మహే గారు ‘‘ఇంతకూ అసలు అచ్చమాంబ అస్తిత్వం ఏమిటి? గుండు వాసుదేవశాస్త్రి మేనకోడలు కనుక ఆమె పుట్టింటి వారి ఇంటి పేరు మరేదో అయివుంటుంది. మేనరికం వల్లనో మేనమామ ఇంటి పేరింటి సంబంధం కావడం వల్లనో ఆమె గుండు అచ్చమాంబ అయివుంటుంది. ఆమె జననం, తల్లిదండ్రుల వివరాలు, పెంపకం, చదువు, పెళ్లి, సంతానం మొదలైన వ్యక్తిగత వివరాలేవీ ఇప్పటికీ తెలియవు. పుస్తక ప్రచురణను బట్టి గోదావరి జిల్లాలోనూ, గుంటూరు లోనూ ఆమె ఉన్నట్లు ఊహించవచ్చు’’ అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇది ఏ నెల సంచికో వివరాలు తెలియడం లేదు. బహుశా ఏప్రిల్‌ 2020 నాటి సంచిక అయి వుంటుంది. ఈ వ్యాసాన్ని నేను ఇటీవలే చదివిన. ఆ వ్యాసం చదివిన తర్వాత నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకునేందుకు ఈ ప్రయత్నం.
ఇప్పుడిక్కడ గుండు అచ్చమాంబ తల్లిదండ్రుల వివరాలను సైతం జోడిస్తున్నాను. ఆమె తల్లి, పినతల్లి కూడా కవయిత్రులే అనే విషయాన్ని కూడా రికార్డు చేస్తున్నాను. అయితే ఆ వివరాల్లోకి వెళ్ళే కన్నా ముందు అచ్చమాంబ గురించి ఆమె రచనల గురించి కొంత తెలుసుకుందాం!
కాత్యాయని మేడమ్‌ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి నేను మొదలు పెడతాను. నేను గతంలో భండారు అచ్చమాంబ కథల కోసం పాత పత్రికలను తిరగేస్తున్న సమయంలోనే నామసామ్యం మూలంగా గుండు అచ్చమాంబ పేరును తరచూ చూసిన. పది పన్నెండేండ్ల జ్ఞాపకం ఇంకా తాజాగానే ఉంది. ఆమె చిత్రం కూడా చూసినట్టు గుర్తు. ఇప్పుడు మళ్ళీ అన్నీ తిరగతోడినట్లయితే ఆమె చిత్రం బయటపడే అవకాశముంది. అది అట్లా ఉండనిచ్చి ముందుగా ఆమె రచనలను చూద్దాం. ‘‘1907లో ప్రచురితమైన సత్కథామంజరి వెనక భాగాన ‘ఏ తద్గ్రంధ కర్తచే రచియింపబడిన గ్రంధము’ అనే శీర్షికన క్రింద పేర్కొనబడిన వాటిలో వసంతర్తు, వర్షర్తు వర్ణనము, మనీషా పంచకముతో పాటు సుఖము, ధూమశకటము, నక్షత్రశాల ఖండికలు కూడా ఉన్నాయి. వాటితో పాటు మోతిమహలు అనే ఖండిక కూడా ఉంది. అంటే ఇవన్నీ 1907లోగా ప్రచురింపబడ్డాయన్న మాట’ అంటూ విద్మహే గారు ఆమె రచనలను పేర్కొన్నారు. వీటికి తోడుగా ‘రామేశ్వర యాత్రా చరిత్ర’, ‘శ్రీకాళహస్తీశ్వర కళ్యాణోత్సవము’, ‘ శ్రీవిక్టోరియా మహారాజ్ఞి చరిత్ర’, ‘శ్యమంతకమణి’ నాటకం కూడా వ్రాసినట్లు సత్కథా మంజరి వెనుక పేజీ సమాచారం ఆధారంగా మేడమ్‌ పేర్కొన్నారు. ఈనాటకం గురించి తెలుగునాటక వికాసం లో పోణంగి శ్రీరామ అప్పారావు కూడా రాసిండ్రు. అట్లాగే సత్కథా మంజరి పుస్తకం వెనుక అట్టపై ‘కలగూరగంప’ పేరిట అచ్చమాంబ రచనను పేర్కొన్నారు. దీన్ని మేడం మిస్సయ్యారు. రెండవ కూర్పునకు రాసిన పీఠికలో అచ్చమాంబ తన రచనల గురించి ఇలా పేర్కొన్నది. ‘‘నాకును నన్నయభట్టునకును, తారతమ్యము హస్తికము మించునప్పటికిని, నా తమ్ముడు ప్రస్తుతము బాపట్ల రిజిష్ట్రారగు చి॥భువనగిరి కోదండపాణి నన్నయ భట్టునకు నారాయణభట్టుగా తోడు చూపుచున్నాడు. అతను వ్రాసిన ..స్థాప’ యందతని సామర్ధ్యము లోకులెఱుంగుదురు గాక’’ అని రాసింది. అంటే భువనగిరి కోదండపాణిని తమ్ముడులాంటి వాడిగా పేర్కొన్నది. ఈమెకు కోదండపాణి దగ్గరి బంధువయ్యుంటాడు. భువనగిరి అఖిలాండమ్మ మహిళను పెద్దమ్మగా పేర్కొన్నది. ఈ కోదండపాణి ‘జరాసంథవధ’ నాటకాన్ని రాసినట్లు సత్కథామంజరి పుస్తకం వెనుక అట్టపై సమాచారం వల్ల తెలుస్తుంది. అట్లాగే ‘గుండు అచ్చమాంబికా ప్రణీతముయిన ఋషభ మహాకావ్యము, ఘోషాయాత్రా నాటకము త్వరలోనే వెలువడును’ అని కూడా ఈ పుస్తకం వెనుక అట్టపై రాసిండ్రు. ఇవి గాక భారతీయ వీరులు (1920), శ్రావణ మంగళవారము కథ, పాటలు (1926) రచనల గురించి తెలుగు సాహిత్య కోశం (ఆధునిక విభాగం)లో పేర్కొన్నారు. ఇందులో శమంతకమణి నాటకం గురించి రాస్తూ ‘‘శ్రీకృష్ణుడు శమంతక మణిని జాంబవంతుని దగ్గర నుంచి తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చి, సత్యభామను వివాహమాడటం ఇతివృత్తం. ఈ రెండు గ్రంథాలకు గుండు వాసుదేవ శాస్త్రి గారే పీఠికలు రాశారు. వీరి రచనలు సంప్రదాయరీతిలో, సుబోధకమైన శైలిలో ఉన్నాయి. వీరు స్త్రీ విద్య, ఆంధ్ర సంగీతము వంటి విషయాలపై సమాకాలిక పత్రికలో వ్యాసాలు రాశారు.(1912-1923) తెలుగు నాటక వికాసం పుస్తకం ఆధారంగా ‘సాహిత్య కోశం’లో రాసిండ్రు. ఈ వివరాలన్నీ కాశీనాథుని నాగేశ్వరరావు సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్రవాఙ్మయ సూచికలో (పేజి 250) కూడా ఉన్నాయి. కాళహస్తీశ్వర కళ్యాణోత్సవం 1904లో అచ్చయ్యింది. (కాశీనాథుని నాగేశ్వర రావు, 1994: పేజీ 39). రామేశ్వర యాత్రా చరిత్ర (1900) సంవత్సరములో అచ్చయ్యింది. (కాశీనాథుని నాగేశ్వర రావు 1994: పేజీ 273)
‘శ్రీసత్కథామంజరి’ మొదటి భాగం రెండో ముద్రణ 1920లో గుంటూరులోని చంద్రికా ముద్రణాలయంలో జరిగింది. ప్రథమ ముద్రణకు కాకినాడ నుంచి 10 ఏప్రిల్‌ 1907 నాడు అచ్చమాంబ మేనమామ గుండు వాసుదేవశాస్త్రి పీఠిక రాస్తూ ఈ రచన ‘ఆరేండ్ల క్రిందటే విరచితమయింది’ అని రాసిండు. అంటే ఈ గ్రంథ రచన కాలం 1901. ఇందులో మొత్తం తొమ్మిది మందివి శ్రీ రామకృష్ణ, రుక్మాంగద, ధృవ, శ్రీరామ, అంబరీష, గజేంద్ర, మార్కండేయ, కుచేల, ప్రహ్లాద చరిత్రలున్నాయి. రచయిత్రి నివాసం అప్పుడు గుంటూరులోని అరుండల్‌ పేట.
‘శ్రీ సత్కథామంజరి’ రెండో సంపుటి ‘హిరోయిన్స్‌’ అనే ఇంగ్లీష్‌ టైటిల్‌తో (లోపల సత్కథామంజరి అని తెలుగులో ఉంది) 1920లో వెలువడింది. ఇందులో సీత (శ్రీరాముని భార్య), శకుంతల (దుష్యన్తునిభార్య), దమయంతి (నలచక్రవర్తి భార్య), సావిత్రి (సత్యవంతుని భార్య), చంద్రమతి (హరిశ్చంద్రుని భార్య), సుకన్య (చ్యవనఋషి భార్య), మంగళాంబ (మంగళగౌరీ వ్రత విఖ్యాత భార్య), సత్యవతి (ప్రేమానంద స్వామి భార్య), పద్మావతి (జయదేవ స్వామి భార్య) గురించి చరిత్రలను పద్యాల్లో రాసింది. ఇందులో పద్మావతి ‘అష్టపదులు’ వ్రాసిన భక్తాగ్రేసరుడు జయదేవుని ధర్మపత్ని. నవీన చరిత్రములో నాంగ్లేయుల మెదటి దినములలో నిక్కట్టుల పాలైన పతివ్రత సత్యవతి చరిత్ర కూడా నిందు జేర్పబడినది’’ అంటూ కేవలం పౌరాణిక పాత్రల గురించే గాకుండా ఆధునిక మహిళలు వారి సాహసాన్ని పద్యాల్లో చిత్రించింది. ఇట్లా ఆధునిక మహిళలను పద్యాల్లో చిత్రించిన మొదటి రచన ఇదే కావొచ్చు.
భండారు అచ్చమాంబ రచన ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’ 1902లో పుస్తక రూపంలో అచ్చయితే ఆమె తర్వాతి రచనగా గుండు అచ్చమాంబ రచనలు (1901లో రాసినప్పటికీ) 1907లో పుస్తక రూపంలో వెలువడ్డాయి. (నిజానికి 1921కి ముందు మొత్తం వంద మంది మహిళల రచనలను కొమర్రాజు లక్ష్మణ రావు, కాశీనాథుని నాగేశ్వర రావులు కలిసి తీసుకు రావడానికి ప్రయతించించిన ఆంధ్ర వాఙ్మయ సూచిక లో పేర్కొన్నారు. 1923లో కొమర్రాజు చనిపోవడముతో కాశీనాథుని నాగేశ్వర రావు అనుబంధములో ఇచ్చిన రెండు భాగాల్లో 1927 వరకు అచ్చయిన పుస్తకాలను జోడించారు. ఇట్లా 1927 వరకు తెలుగులో 150కి మందికి పైగా రచయిత్రులున్నారు. వీరందిరిని ఆంధ్ర కవయిత్రుల చరిత్ర రాసిన ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కూడా పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి ఆంద్ర వాఙ్మయ సూచిక, బార్నెట్ బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీ తెలుగు కేటలాక్ పుస్తకం, గోల్కొండ కవుల సంచికల్లో అచ్చయిన రచయిత్రులందరు కలిపితే 200లకు (1934 వరకే) మించుతారు. ఎవరయినా పూనుకొంటే మంచి ప్రాజెక్టు అవుతుంది). మళ్ళీ విషయానికి వస్తే అచ్చమాంబ సత్కథా మంజరి పేరిట మూడు సంపుటాలను వెలువరించింది. ఇందులోని రెండవ సంపుటిలో పౌరాణిక మహిళ గురించే గాకుండా ఆధునిక కాలానికి (లాహోర్‌)కు చెందిన ప్రేమానంద స్వామి అనే అతని భార్య సత్యవతిని గూర్చి కూడా రాసింది. అందులోని పద్యాలిలా ఉన్నాయి. (మచ్ఛుకు)
శా॥ శ్రీమీఱన్‌ నిరతాన్న దాత యను వాసిం గాంచుచుంగౌడమ
గ్రామస్థుఉండు గుణోత్తరుండొకడు మిత్రఖ్యాతి దీవించు న
మ్మామ న్గొుచు భర్తjైుతనరు ప్రేమానంద గోస్వామి నెం
తే మన్నించును సాధ్వి సత్యవతి త న్నీక్షించు వారౌననన్‌
శా॥ లాహోర్ప్రాంతమునన్‌ జనాళి మది న్కుందొమ్మి గావించుచుం
బేహారు ల్వెఱగంది ఱిచ్చపడ దేవీ సింహుడుద్యోగి jైు
బాహాటం బగు కంపెనీ ప్రభుత్వ పర్వన్‌ హ్ల కల్లో మౌ
నాహారావ మెసంగబన్ను గొనుని`త్యంబున్‌ దయాశూన్యుడై
ఉ॥ లేదు సుభిక్ష మన్‌ పుకు లేజివురుం గనరాదు చెట్ల బై
రేదియు మ్వొ నే పదునెక్కదు గ్రీష్మము మెండు కాపుం
బేదఱికంబు నొంద విను వీధికి న్లని మబ్బొకప్పుడున్‌
రాదు పోటుక్కునన్‌ జినుకు రాుట లేదది యేమి చిత్రమో!
1920లోనే రెండో సారి ప్రచురితమైన ‘సత్కథామంజరి’ మూడో సంపుటములో సీత వృత్తాంతమున్నది. ఇందులో విల్లుగాంచిన సీత, వరనిశ్చయమైన సీత, పరశురామునింగాంచు సీత, అడవికి వెళ్ళు సీత, రావణుని రథముమీది సీత, అశోకవనమున నుండు సీత, రావణ సంహారము వినిన సీత, అగ్ని ప్రవేశ మొనర్చు సీత, పట్టాభిషేకమునకేగు సీత అనే పేరిట ఖండికలున్నవి. ఈ మూడు భాగాలకు ముందుమాటలు రాసిన మేన మామ 1920నాటికి చనిపోయిండు. ఆయన ఈ అన్ని భాగాల్లోనూ ఈ క్రింది పద్యం జోడించిండు. తప్పుంటే తెలియజేయమన్నడు.
‘‘చ॥ ఇగ సత్కవి ప్రకరి మెంతయు క్షణ వేత్తలై సభా
స్తలుల జెలంగు పండితవితానముం దమ కూర్మిపుత్రియుం
జెలియుగా దంచి నను జిత్తమున్గరుణించి తప్పుల
న్గలిగిన జూచి దిద్దుదురు గాత క్షమింతురు గాత నిచ్చున్‌..
అట్లాగే కవయిత్రి అచ్చమాంబ కూడా ఈ క్రింది పద్యాన్ని మూడు సంపుటాల్లోనూ పేర్కొన్నది.
శ్రీమెఱయగ ముమ్మూర్తులు
దామైమేల్గోరదగు సుధానిధి వాత్మా
రామబ్రహ్మమ సీతా
రామా! యవధారు లోకరక్షణకామా॥
ఈ కవయిత్రి ఆధునిక కవిత్వం కూడా రాసింది. 1922లో ‘సంపెంగ’ పేరిట వెలువరించిన ఖండ కావ్య సంపుటిలో వివిధ అంశాలపై పద్యాలున్నాయి. అందులో ఒంగోలు పశువుల సంత, రాజమండ్రి మిషనరీ హాస్పిటల్స్‌, ఆంధ్రభాష, స్కూల్స్‌ గురించి రాసింది. ఈమె రాజమండ్రిలోనే పుట్టింది రాజమండ్రిలోనే పెరిగింది. గుంటూరులో నివసించింది.
అందుకే గౌతమీ నది గురించి ఇలా రాసింది.
కం॥ శ్రీరాణ్మహేంద్ర పురమున
గౌరవపుష్కరపు(దిధుల ఘన గౌతమి శృం
గారాస్పదయ కను(గొను
వారి ముదము పెనిచెలోక వంద్య మహాత్మా!
సీ॥ గోదావరీనదిం గోటిలింగాల రే
విది మహాస్థమంచు నెన్నినారు
రాచబాటలు తీర్చి రమణీయముగ(బెద్ద
పాలక వసతు లేర్పఱచినారు
కూరగాయలు పండు కొను వస్తువుల నెల్ల
విరివిగ నంగళ్ళ( బెట్టినారు
కనువిందొసగు పండ్ల దినుసు లొక్కొక్క చోట
నేర్పాటుగా నమ్మ నెంచినారు
గీ॥ పాత్రసామగ్రి మెండుగా( బఱచినారు
వివిధ దేశపు సరకుల( బెట్టినారు
బొమ్మను లక్క పిడతల నమ్మినారు
జనము లుపయోగముగొను బుష్కరపు వేళ!
ఇప్పుడిక ఆమె పుట్టు పూర్వోతరాల విషయానికి వద్దాము. ఈమె సుప్రసిద్ధ పండితుడు రాజమండ్రి కళాశాలలో అధ్యాపకుడిగా ఉండిన వావిలాల వాసుదేవశాస్త్రి సోదరి. ఈ వాసుదేవ శాస్త్రి షేక్‌స్పియర్‌ రాసిన ‘జూలియస్‌ సీజర్‌’ నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేసిండు. ఇట్లా ఇంగ్లీషు నాటకాలను అనువాదం చేసిన వారిలో ఈయనే మొట్టమొదటివాడు. ఈయన 1851లో పుట్టి 1897లో చనిపోయిండు. ఈయన వీటితో పాటు ‘బ్రాహ్మణీయము’ అనే ప్రబంధాన్ని 1875లో రాసిండు. అట్లాగే 1874లో ముముక్షు తారకం పేరిట భజగోవింద శ్లోకాలను తెలుగులోకి అనువదించిండు. 1877లో ‘పిత్రారాధన’ అనే పద్యకావ్యాన్ని రాసిండు. 1879లో ‘మాతృరూప స్మృతి’ పేరిట విలియమ్‌ కౌపర్‌ రాసిన ఖండకావ్యాన్ని తెలుగులోకి తర్జుమా చేసిండు. అట్లాగే బ్రాహ్మణుల్లో శాఖా బేధాలను నిరసిస్తూ ‘నందక రాజ్యం’ పేరిట ఒక స్వతంత్ర నాటకాన్ని రాసిండు. ఈయన రాజయోగి, వివేకవర్ధని మాస పత్రికల్లో అనేక వ్యాసాలను ప్రకటించారు. (టేకుమళ్ళ కామేశ్వరరావు, నా వాఙ్మయ మిత్రులు: విశాలాంధ్ర ప్రచురణ. 1996) ఈయన గురించి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ‘ఆంద్ర రచయితలు’ పుస్తకములో వివరంగా రాసిండు.
గుండు అచ్చమాంబ తండ్రి పేరు అప్పయ్య శాస్త్రి (1828-1874), తల్లి పేరు మహాలక్ష్మమ్మ (1831-1879). ఈమె పఠ్యం అద్వైత బ్రహ్మశాస్త్రి కుమార్తె. అచ్చమాంబ తల్లివైపు వారు కూడా పండితులే. తాత పఠ్యం అద్వైత బ్రహ్మశాస్త్రి భాషోద్ధారకులు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌కు గురువు. ప్రపితామహుడైన వావిలాల వెంకట శివావధానులు- వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆస్థాన పండితుడు. అప్పయ్య శాస్త్రికి ఆరుగురు కొడుకులు. ఇద్దరు కుమార్తెలు(?).
ఈమె జీవిత వివరాలు 1898లో తన అన్నగారి స్మృత్యర్థం ‘భ్రాత్రారాధన’ పేరిట వావిలాల అద్వైత శాస్త్రి రాసిన పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం బందరులోని భైరవ ముద్రాక్షరశాలలో ప్రచురితమయింది. దత్తత పోయిన అద్వైత శాస్త్రి తన అన్న వావిలాల వాసుదేవశాస్త్రి జీవితాన్ని పద్యాలో రాసిండు. ఇందులో ఆనాటి రాజమండ్రి కాలేజి చదువు, ప్రయాణ సాధనాల గురించి కూడా రాసిండు. నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం, ఒంగోలు, హైదరాబాద్‌, బనారస్‌, మదరాసు, రామేశ్వరం మొదలైన ప్రాంతాల గురించి కూడా రాసిండు. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన వివరాలు, బంధువులు, వ్యక్తుల విషయాలను రికార్డు చేసిండు. ప్రధానంగా ఉద్యోగస్థుల జీతభత్యాల్లో పెరుగుదల గురించి రాసిండు. ఈ పుస్తకం పునర్ముద్రించినట్లయితే ఆనాటి చదువుకున్న పండితుల జీవితాలు, జీతాల గురించి తెలుస్తుంది అద్వైత శాస్త్రి ఒక పద్యంలో తన తల్లి మహాలక్ష్మమ్మ గురించి ఇట్లా రాసిండు.
నమ్మశ్రీ మహాలక్ష్మమ్మ హర్షమొంద
అత్త అక్కయ్య బాబయ్య యుత్తముండు
నాయన ద్వైత బ్రహ్మార్యుడాయ మాంబ
నన్ను బెంచిరి బ్రేమ చే నన్న వినమె
...
తల్లి మహాక్ష్మమ్మ గర్భవతిగా ఉన్న కాలంలో ఆమె భర్త అప్పయ్య శాస్త్రి గతించిండు. ఆయన తన 46వ యేట భావ సంవత్సరం అంటే 1874లో చనిపోయిండు. ఆ విషయం గురించి ఇట్లా రాసిండు.
కన్ను మూసెను నిర్వాణ కామబ్బ
భావ వర్షము రాగానె చావు వచ్చె
నలుబదారేండ్లు నిండని గలిన మీకు
అమ్మ గర్భిణి గానుండ వానువాయ
...
స్కూలు మేష్టరి శాస్త్రన్న జాలియుండ
ఇంతనెలన్ని బూర్తిగా జింతతోనె
అమ్మగనె వెర్రి చెల్లిని నాతురముగ
మాసికము దీర్చి జాతక మేసి యుంచి
చెల్లి అచ్చమాంబ పుట్టుకతో పాటు తల్లి చావు గురించి ఆయన ఇలా రాసిండు.
సంతసము బోయిమన అమ్మజింత జెందె
మాత బహుధాన్య వత్సర మాఖ బహుళ
ద్వాదశిని గడిపి శివరాత్రి పర్వవేళ
మించి పరలోక మేగ నమ్మెత్త తల్లి
అని చెప్పిండు.
దీన్ని బట్టి గుండు అచ్చమాంబ 1875లో జన్మించిందని నిర్ధారించవచ్చు. అంటే ఆమె కడుపులో ఉండగానే తండ్రి చని పోయిండు. ఈమె తల్లి కూడా బహుధాన్య సంవత్సరం శివరాత్రి నాడు అంటే 1878లో చనిపోయింది. అంటే నాలుగేండ్లు నిండకుండానే అచ్చమాంబ తల్లిని, తండ్రిని ఇద్దరినీ కోల్పోయింది. అందుకే ఈమెను అపయ్య సోదరుడు (బుచ్చయ్య) పెంచి పెద్ద చేసినాడు. పెంచిన తల్లి పేరు రాజ్యలక్ష్మమ్మ. ఈ రాజ్యలక్ష్మమ్మ పేరిటనే అచ్చమాంబ పద్యాలు రాసింది. అచ్చమాంబ మరణానికి చింతిస్తూ వావిలా వాసుదేవశాస్త్రి రాసిన రెండు పద్యాలను కూడా ఇందులో (భ్రాత్రారాధన)లో చేర్చిండ్రు. అవి..
తండ్రి చన్న పిదప, ధరణి
పుట్టెడువారు బ్రతికి విభవమెంతో
పడయుదరని పెద్దలన్న మాట వృధచేసి
విధినీకు విధవ జన్మ వ్రాసె వెఱ్ఱికూన॥
రాజమంద్రిని బుట్టి రాజమంద్రిన
బెరిగి రాజమంద్రిలో విరాజియై
సభా జనంబునకు సుభోజనమైన
ట్లు బెండ్లి యైతిగదవె వెఱ్ఱికూన॥
ఇట్లా రాజమండ్రిలోనే చదువును సాగించిన ఈమె వివాహం చిన్నతనంలోనే గుండు వంశానికి చెందిన అప్పరాజు అనే అతనితో జరిగింది. బహుశా ఆ మామగారే గుండు వాసుదేవశాస్త్రి. మేన మామ కూడా!
...
పురికి తమ్మన్న ప్లీడరయి విరివి నుండ
మళ్లి క్రిష్ణకుమారె పెత్తల్లి కొడుకు
అప్పరాజమనుతచి నచ్చమ్మ కవికి
వచ్చె వైధవ్య మందుకై వంతజెందు
చుండ వెర్రికి నదిప్రాప్తి యుండెనన్న
చిన్న తాతయ్య పెంపుడు గన్న బామ్మ
మన్ను జేసెన్న భార్య తనతోనుండ
జబ్బు జీర్ణించి శ్మయి యుబ్బుచూప
కారుమూరేగి జెందెన కాలమృతిని
మార్గశిరశుద్ధ యష్టమి మారకంబు
వెర్రితో నెవ్వరేగరు వీలుగనక
గొల్లపురి నుంచి హరిబంపె గుండు వారి
మామ్మలన్నలు జేరిరి మరుదినంబు
మనకు గారాబు చెల్లెలు చినకుమారి
తండ్రి గనలేదు యెరుగదు తల్లి బాగ
పిల్లలును లేరు పతిబాయె పిన్ననాడె
ఈ రచన వల్ల అచ్చమాంబ తల్లిదండ్రు చిన్ననాడే చనిపోయారని తెలుస్తుంది. అట్లాగే బాల్య వివాహం, ఆ తర్వాత భర్త కూడా చిన్నతనంలోనే చనిపోయిండు. పిల్లలులేరు. ఈ దశలో ఆమె రాజమండ్రిలో చదువుకున్నది. ఆ తర్వాత గుంటూరులో నివసించింది. తనకు కలిగిన కష్టాలను కవిత్వ రచన ద్వారా అధిగమించింది. ఈమె రచనలు 1926 వరకు వెలువడ్డాయి. ఆ తర్వాత కూడా ఆమె బతికి ఉండే అవకాశమున్నది. అయితే 1875 నుంచి 1926 వరకు ఈమె కచ్చితంగా జీవించి యున్నదని నిర్ధారించవచ్చు.
ఈమె రచనలు ముందే పేర్కొన్నట్లుగా 1900లో మొదటి సారిగా ప్రచురితమయ్యాయి. (రామేశ్వర యాత్రా చరిత్ర) 1907లో మొదటి సారిగా అచ్చయిన సత్కథామంజరి మూడు భాగాలు 1920లో పునర్ముద్రణ పొందాయి. 1922లో తాను రాసిన కవితా ఖండికన్నింటిని ‘సంపెంగ’ పేరిట ప్రచురించింది.
మేనమామ గుండు వాసుదేవ శాస్త్రి 1917(8)లో చనిపోయిండు. (ఆంధ్ర పత్రిక ఉగాది సంచిక-1918) ఈయన ఒంగోలు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో రెవిన్యూకు శాఖలో పనిజేసిండు. గుండు వాసుదేవ శాస్త్రి ఆరవ తోబుట్టువు రాజ్యలక్ష్మమ్మ చనిపోయినప్పుడు ఈ కింద పేర్కొన్న పద్యాను రాసింది. (బహుశా ఈ రాజ్యలక్ష్మి యే ఆమె తల్లి).
క॥ శ్రీ రాజ్యలక్ష్మీ యప్పా!
ఈ రాజ్యము లెల్ల వదలి యేగితి వమ్మా
రారమ్ము పోయె ననుచును
నారాయణ స్మరణ తోడ నాలుక కదన్‌
గీ॥ రమ్ము రమ్మిక( దలుపు (దీయమ్మటంచు
పోయె మామ్మయ్య తాజచ్చిపోయె ననుచు.....
అట్లే తల్లి గురించి ఇలా కవిత్వ మల్లింది.
ఉ॥ ప్రొద్దున నేడుగంటలకు బోసిన గిన్నెడు జావ(ద్రావి యు
కెద్దియు వద్దు నాకు(జలి యింకొక దుప్పటి గప్పి మీరు
యొద్ద నె(గూరుచుండుడనెనొక్కెడ గాలును రాయుమంచువే
నిద్దుర బోయి లేచి శివునిన్‌ మదిలో స్మరియించె భక్తితో
వీటితో బాటుగా తన తల్లి వావిలాల రాజ్యక్ష్మమ్మ రాసిన ఒక కీర్తనను తన రచనల్లో పేర్కొంది. ఆ కీర్తన ఇలా ఉంది.
కాంభోజి రాగము - చావు తాళము
జననీ, నీ పదసేవ సల్పెద ననుగు బాలుని
సమయమీయవదే మమ్మా ఓ జననీ ॥జ॥
1. కారుమూరు పురీ కాపురమున్నట్టి కామాక్షి నన్గావవే
2. బ్రహ్మపట్టణమునందు బహ్మేశ్వరమ్మ పాదమ్ములే నమ్మితిని ॥జ॥
3. వసుధలో వావిలాల రాజ్యలక్ష్మీకి వరములీయరాగదే జననీ॥
జగదీశ్వరమ్మ పిన్నిగారు చెప్పినదిగా మరో కీర్తనను పేర్కొంది.
(శహాన రాగము తాళము)
గురువును జూడగనే గుఱినిలిచినదమ్మ
1. పరమపదంబైన బయలు గనుగొంటినమ్మ
అరిషడ్వర్గము నన్నంటక యున్ననమ్మ
అరసి పంచభూతములణచి వైచితినమ్మ ॥గు॥
2. ప్రాబల్యమైన హరి నీ ప్రేమతో గలడు కాని
ప్రణవనాదంబైన పలుకు వినగంటినమ్మ
3. బ్రహ్మానందముతోడ బ్రహ్మేశ్వరమ్మపాడ
నిమ్ముగా నాదు హృదయమ్మున నిలిచెనమ్మ!
ఇట్లా తెలుగు సాహిత్యానికి ఇద్దరు కొత్త కవులను కూడా ఆమె పరిచయం చేసింది. ఇంత చరిత్ర ఉన్న ఈమె రచనలు (దాదాపు అన్నీ) ఇప్పుడు లభ్యమవుతున్నందున వాటిని పునర్ముద్రించినట్లయితే తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా ఆధునిక మహిళా సాహిత్యానికి మేలైన చేర్పు అవుతుంది. ఆ పనికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ గాని, విశ్వవిద్యాయాలు, అకాడెమీలు, సాహితీ ప్రేమికులు పూనుకుంటారని ఆశిస్తున్నాను.
గుండు అచ్చమాంబను ఆమె లాంటి మరెందరో మహిళా సాహితీవేత్తలకు కొత్తగా పాణం పోస్తున్న కాత్యాయని విద్మహే గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు.
- సంగిశెట్టి శ్రీనివాస్

Friday, June 19, 2020

వందేండ్ల కిందటి మన సంస్కర్తలు


మన గొప్ప మనం చెప్పుకుంటే అది హెచ్చులు/ఏతులుగా అనిపిస్తయి. అదే విషయాన్ని వేరేవాళ్ళు జెబితే దానికి ఆమోదనీయత, గౌరవం రెండూ ఉంటాయి. హైదరాబాద్‌ రాజ్య సంస్కర్తల గురించి ఆంధ్రాకు చెందిన కుసుమ ధర్మన్నరికార్డు చేసినంత గొప్పగా తెలంగాణ వాళ్ళు కూడా రికార్డు

Add caption

చేయలేదు. కుసుమ ధర్మన్న స్వయంగా హైదరాబాద్‌లో అప్పటి రాజకీయ నాయకుడు, హైదరాబాద్‌ అంబేడ్కర్‌గా ప్రసిద్ధి గాంచిన బి.ఎస్‌. వెంకటరావు అతిథిగా చాలా ఏండ్లున్నాడు. ఆయన దగ్గర పౌర సంబంధాల అధికారిగా పనిచేసిండు. ఈయనకు 1921 కన్నా ముందు నుంచే హైదరాబాదీ నాయకుతో సంబంధాలన్నాయి. బి.ఎస్‌.వెంకటరావు 1946 ఆ ప్రాంతంలో హైదరాబాద్‌ రాజ్య ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అంబేడ్కర్‌ విద్యాసంస్థల స్థాపనకు చేస్తున్న కృషికి మంత్రిగా తోడ్పాటు నందించారు. అందుకోసం ప్రత్యేకమైన ఫండ్‌ని ఏర్పాటు చేసిండు. ఈ వెంకటరావు సాన్నిహిత్యంతోనే 1921 నాటికే కుసుమ ధర్మన్న ఉద్యమకారుడిగా మారిండు. తర్వాతి కాలంలో ఆయన ప్రభావంతోనే దళితులు ఇస్లాం మతంలోకి మారి తమ ఆత్మగౌరవాన్ని రక్షించుకోవాలని పిలపునిచ్చిండు. 1937లో రాజమండ్రిలో జయభేరి అనే పత్రికను ఏర్పాటు చేసి దళితుల అభ్యున్నతికి కృషి చేసిండు. వృత్తిరీత్యా వైద్యుడైన ధర్మన్న అనేక ఊర్లు తిరుగుతూ ఒక వైపు వైద్యం మరోవైపు ఉద్యమ ప్రచారం చేసిండు. ఈయనకు స్ఫూర్తి ఆంధ్రా ప్రాంతం, మదరాసు ప్రావిన్స్‌ నుంచి గాకుండా హైదరాబాద్‌ రాజ్యం నుంచి అందింది.

జిల్లా చరిత్రలకు ఆద్యుడు శేషభట్టర్

జిల్లా చరిత్రలకు ఆద్యుడు శేషభట్టర్
తెలంగాణలో బహుశా మొత్తం తెలుగు లోనే వెలువడ్డ మొట్ట మొదటి జిల్లా చరిత్ర గ్రంథం ‘శ్రీ నల్లగొండ చరిత్రము’. దీని రచయిత శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యులు. ఈ గ్రంథం మొట్టమొదటి సారిగా 1919లో నల్లగొండలో తాను స్థాపించిన ‘శ్రీ వీరేశలింగ కవి కంఠాభరణ గ్రంథమాల’ తరపున మొదటి గ్రంథంగా (1921) వెలువరించాడు. అంతకు రెండేండ్ల ముందు చనిపోయిన కందుకూరి వీరేశలింగం పేరిట ఈ గ్రంథమాల స్థాపితమయింది. ‘‘దేశోపకారమే పరమావధిగానెంచి క్రీ.శ. 1919.లో నీ గ్రంథమాల స్థాపింపబడినది. ఇందు దేశాభివృద్ధికిని భాషాభివృద్ధికిని మిక్కిలి యావశ్యకములైన యుద్గ్రంథములు మూడు నెలలకొకటి చొప్పున బ్రచురించెదము’’ అని పుస్తకం వెనక అట్టపై పేర్కొన్నారు. ఈ గ్రంథమాల నిర్వహణలో నీలగిరి పత్రిక సంపాదకులు షబ్నవీస్‌ వెంకటరామనరసింహారావు, కొండగడప (నల్లగొండ జిల్లా) జాగీర్దారు అక్కినేపల్లి జానకిరామారావు (1885-1975)లు సహాయ పడ్డారు. ఈ గ్రంథమాల తరపున రాబోవు పుస్తకాలుగా చిల్లరిగె శ్రీనివాసరావు నవల శ్రీధర విజయము, బ్రాహ్మణ సాహసము (రెండవ భాగము- బహుశా ఒద్దిరాజు సోదరుల గ్రంథం) పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ ‘శ్రీ నల్లగొండ చరిత్రము’ పుస్తకంలో నమోదయ్యాయి. ఈ పుస్తకం కేవలం 30 పేజీల్లోనే వెలువడ్డప్పటికీ ఇందులో ఇప్పటి వరకు నల్లగొండ గురించి చరిత్రకెక్కని చాలా అంశాలు రికార్డయ్యాయి.
శేషభట్టర్‌ లభ్యరచనలన్నింటిని (భావ ప్రపంచము మినహా) విమర్శకులు, సాహితి చరిత్ర కారులు శ్రీరంగాచార్య గారు తమ సంపాదకత్వంలో 2018లో పుస్తకంగా తీసుకొచ్చారు. గ్రంథ రచయిత సంతానం తోడ్పాటుతో ‘శేషభట్టర్‌ వెంకట రామానాజాచార్యుల (లోకజ్ఞుడు) రచనలు’ పేరిట ఈ పుస్తకం అచ్చయ్యింది. ఇందులో రుక్మిణి (1916-నవల), ప్రాకృత దాంపత్యము (1918-నవల), అఖిల భారత తస్కర మహాసభ (1940 ప్రాంతం- పానుగంటి సాక్షి వ్యాసాల మాదిరి రచన), నల్లగొండ చరిత్రము (1921-చరిత్ర) ప్రేమ బలము (లఘు నాటిక), మౌఢ్య మహిమ (1910- నాటకం) రచనలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఇవి గాకుండా శేషభట్టర్‌ ‘కర్మస్థలము’, ‘ఆంధ్రవీర ప్రబోధము’, ‘హాస్య నాటికలు’, ‘హిందూ దేశ చరిత్ర’ (నాటకం), ‘బహెరెనూర్‌’ (నవల), ‘ప్రకృతి కన్య’ (నవల) గ్రంథాలు ఆయన రచనలుగా రికార్డయ్యాయి. అలాగే ఈయన ‘అఖిల భారత తస్కర మహాసభ’ అనే వ్యంగ్య రచన కూడా చేసిండు. వీటితో పాటు ఆయన 1920-40 మధ్య కాలంలో నీలగిరి, తెనుగు పత్రిక, సుజాత, గోలకొండ పత్రికల్లో అనేక పద్యాలు రాసిండు. అందులో అస్పృశ్యత నివారణపై రాసినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సి ఉన్నవి.
తన సంపాదకత్వంలో వెలువడ్డ ‘శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యుల రచనలు’ కాపీనొకదాన్ని శ్రీరంగాచార్య సారు నాకిస్తూ చదివి దాని మీద రాయమన్నారు. ఇన్నాళ్ళు కుదురలేదు. ఈ కరోనా సమయంలో దాన్ని చూడడమయింది. అయితే ‘నల్లగొండ చరిత్రము’ పుస్తకములో కొన్ని పేజీలు అచ్చులో మిస్సయినాయి. అవి ఆ గ్రంథానికి విలువని జోడించేవి.
ఈ నల్లగొండ చరిత్రములో ఆ పట్టణానికి, జిల్లాకు సంబంధించిన అనేక వివరాలున్నాయి. 1800 ఆ ప్రాంతంలో నుంచి నల్లగొండలో జనావాసం పెరుగుతూ వచ్చిందని, అంతకుముందు ‘పానగల్లు ’ ప్రధాన పట్టణమని పేర్కొన్నాడు. 17వ శతాబ్ది ఆరంభంలో ఇక్కడ ప్రతి గురువారం జరిగే సంతలో దాదాపు 70, 80 వే రూపాయల వ్యాపారం జరిగేదని పేర్కొన్నాడు. ఇంతవరకు ఆధునిక చరిత్రలో సరిగ్గా రికార్డు కాని చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. అందులో ప్రధానమయింది. కుతుబ్‌షాహి రాజుకు నల్లగొండ దుర్గాధీశుడు హరిశ్చంద్రుడుకు సంబంధించిన యుద్ధం. దీని గురించి ఈ గ్రంథంలో శేషభట్టర్ ఇట్లా రాసిండు.
‘‘1516లో (నిజానికి అది 1519- అసలు పుస్తకములో అసీసు తప్పుగా 516 అని ఉంది) ‘బహమన్‌ షాహీ’ రాజ్య మంతరించి ‘కుతుబ్‌షాహీ’ రాజ్యకాల మారంభమాయెను. ఈ రాజ్య స్థాపకుడైన ‘మొహమ్మదు కులీకుతుబ్‌షా’ తన రాజ్యమును ధృడపరచు కొనుటకై బయలు వెడలి గోల్కోండ నుండి తూర్పు సముద్రము వఱకు పానగల్లు, మచిలీబందరు, రాజమండ్రి, రాజుకొండ, కొండపల్లి, వేలూరు, మొదలైన 70 జిల్లాలను జయించెనట. అందు నల్లగొండ దుర్గమును గురించి యీ ప్రకారముగా చెప్పబడినది:
కుతుబుషా బహు సైన్య యుక్తుడై నల్లగొండ దుర్గము నావరించి యుండెను. ఆ కాలమున నీ దుర్గమును హరిశ్చంద్రుడను రాజు (దుర్గము పునర్నిర్మాణము చేసిన వాడు) పాలించు చుండెను. హరిశ్చంద్రుని ధైర్య సాహసము వలనను దుర్గము యొక్క బలిష్టత వలనను కుతుబుషా యెంత ప్రయత్నించినను విజయము సమకూడునట్లు కాన్పించదాయెను. అనేక దినము ముట్టడి వలన యిరుదెగ వారును విసువు జెంది యుద్ధమంత మొందిన బాగుండునని దలంచు చుండిరి. కుతుబుషా సంధి చేయనెంచి యీ వార్త రాజునకు జెప్పబంపెను. అతడును దాని కొఱకే నిరీక్షించు చున్నవాడు గావున తాను పాషాకు సామంతుడుగ నుండుట తన కిస్టమే యనియు షా తనయెడల క్రోధ భావము మాని స్నేహ భావము బూన వలయునని యుంజెప్పి యనేకమగు విలువ గల కానుకతో గూడ తన రాయబారిని కుతుబుషాహ వద్దకి బంపెను. షాహ సైతమా రాయబారిని తగురీతిని సన్మానించి తన మనసున నిట్లని వితర్కించెను. ‘‘నేనిన్ని దినముల నుండి ఈ చిన్న దుర్గమును ముట్టడి వేసియు దీనిని జయింపలేక సంధిచేసుకొని పోవుట నా రాజ గౌరవము కర్హమయిన పనిగాదు. ఏట్లయినను దీనిని వశపరుచుకో వలయును’’ ఇట్లు వితర్కించి రాయబారిని తిరిగి పంపివేయు నప్పుడతనితో ఓయీ! మీ రాజుతో నా మాటలుగా నిట్లుల చెప్పుము. ‘‘ఇప్పుడు మన కిద్దఱకును సంధి కుదిరినది కావున మన మన్యోన్య స్నేహితులము. నల్లగొండ దుర్గము అత్యున్నతమై శత్రువుకగమ్యమై కాన్పించు చున్నది. ఇట్టి యద్భుత విషయమును నీ మిత్రుడునగు నేను చూచిపో నిచ్చగించితి’’ నని చెప్పెను. హరిశ్చంద్రుడా మాటల వలన కుతుబుషా దురుద్దేశ్యమును తక్షణము గ్రహించి యాతని కిట్లు చెప్పి యంపెను.
‘‘మీరు మీయిష్ట ప్రకారమే దుర్గము జూచి వెళ్ళవచ్చును.’’ కాని మీ వెంట మాత్రము కొందరు ముఖ్యానుచరులు తప్ప సైన్య మేదియు నుండరాదు.’’ ఇట్లు చెప్పి పంపి తన దుర్గ రక్షకులకు యాతనిని కైదు చేయవలయునని గట్టి తాకీదు చేసెను. వారునుతమ కార్యము నందు ప్రమత్తులయి యేయుండిరి. అయినను దైవ బలము లేనప్పుడు మనుష్య ప్రయత్నము నిరర్ధకమగును గదా కుతుబుషా కొందరు మెఱియలవంటి యనుచరులను వెంట నిడుకొని దుర్గద్వారము గుండ లోనికి బోయి యచ్చటి ద్వార రక్షకులను జెండివైచెను. అప్పుడు ద్వారమును బంధించువారెవరునూ లేక పోగా నది వఱకే కుతుబుషా ఆజ్ఞవలన సన్నద్ధులై వచ్చుచున్న యాతని భటులు లోనికి జొరబడిరి. అప్పుడిరు తెగ వారికి పోరు ఘోరమయ్యెను. తెలుగు భటులు స్వల్పముగా నుండుటచే కుతుబుషా సైన్యము వారందరిని నాడు నిశ్శేషముగా సంహరించెనట! హరిశ్చంద్రుడు కైదు చేయబడి అటు పిమ్మట వేంకటగిరి సంస్థానాధిపతిగా జేయబడెననియు నిప్పటికిని, ఆ సంతతివారే దానికి రాజుగా నున్నారనియు నొకరు వ్రాయు చున్నారు’’ అని ఉర్దూ పుస్తకాల ఆధారంగా శేషభట్టర్‌ గారు రాసిండ్రు. ముందుమాటలో ‘మౌల్వీ మొహమ్మద్‌ సుల్తాన్‌ రాసిన ‘జొగరాఫియా దక్కన్‌, సయ్యదు అహమదలీ రాసిన ‘తారీఖె నల్‌గొండ’ పుస్తకాలు ఉపయోగ పడ్డాయని ఇందులో పేర్కొన్నాడు. ఇదంతా నల్లగొండ చరిత్రకు కొత్తగా ఉపయుక్తమయ్యే అంశం. నల్లగొండ చారిత్రాభిమానులు పూనుకొని వీటిని పరిశోధించాల్సిన అవసరమున్నది. ముఖ్యంగా ఉర్దూ ఆధారాలను పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు అంతగా వెలుగు లోకి రాని చరిత్రపై వెలుగులు ప్రసరించే అవకాశమున్నది.
అంతా బాగానే ఉన్నది కానీ రంగాచార్య గారు సంపాదకత్వం వహించిన పుస్తకములోని నల్లగొండ చరిత్రలో మూడున్నర పేజీలకు మించి మ్యాటర్ మిస్సయ్యింది. పుస్తకం మొత్తం కలిపి 30 పేజీలు కూడా లేదు. అందులో మూడు పేజీలు మిస్‌ కావడంతో ‘సయ్యద్‌ లతీఫుల్లా ఖాదరీ’ గోరీ, దుర్గ నిర్మాణానికి సంబంధించిన చాలా విషయాలు అచ్చు కాకుండా పోయాయి. సమగ్ర రచనల్లోని పేజి 296, 15 వలైను నుంచి సమాచారం జోడించాల్సి ఉంటుంది. ఒరిజినల్‌ పుస్తకంలోని 15వ పేజీలో రాను రాను భాషా పరిణామ మహత్వ మున ‘నల్లగండి’ ని ‘నల్లగొండ’ యని పిలువజొచ్చిరి. ఈ యూరికీ పేరు వచ్చుటకీ కారణమే విశ్వసనీయముగా గన్పట్టు చున్నది. అని నల దమయంతుల్లోని నలుని పేరిట నల్‌గొండ వచ్చిందనే ఒక ప్రచారాన్ని కూడా పేర్కొన్నారు. కాకపొతే అది అంట విశ్వసనీయం కాదన్నారు. అయితే రంగాచార్య సారు సంపాదకత్వం వహించిన ఈ పుస్తకంలో రాను రాను భాషా పరిణామ..... తర్వాత మ్యాటర్‌ మిస్సయి మళ్ళీ 18వ పేజీలోని ..... మాతయునైన అనే దగ్గరి నుంచి ప్రారంభమయింది. దీన్ని సవరించాల్సిన అవసరమున్నది.
ఇప్పటి యాదాద్రి-నల్లగొండ జిల్లా దత్తప్పగూడెం గ్రామానికి చెందిన శేషభట్టర్‌ ఏప్రిల్‌ 16, 1900వ సంవత్సరంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రామానుజమ్మ కృష్ణమాచార్యులు. ఈయన వకీలుగా మహబూబాబాద్‌, భువనగరి, నల్లగొండ, దేవరకొండ తదితర ప్రాంతాల్లో పనిచేస్తూ చిన్న వయసులోనే అంటే 44 ఏండ్లకే హైదరాబాద్‌లో మే 19, 1944 నాడు మరణించారు.
1927 నాటికే అస్పృశ్య నివారణపై పద్యాలు రాసిన శేషభట్టర్‌ వెంకటరామానుజాచార్య రచనలు ఒక్క దగ్గరి తీసుకు వచ్చినందుకు శ్రీరంగాచార్య గారు ఎంతైనా అభినందనీయులు. ఈ పనికి శేషభట్టర్‌ కుటుంబ సభ్యులు పూనుకోవడం ముదావహం. మిగిలిన రచనలు కూడా వెలుగు వచ్చినట్లయితే ఆయన ప్రతిభ, పాండిత్యం ప్రపంచానికి తెలిసే అవకాశముంటుంది.
శేషభట్టర్‌ గురించి రాసిన ‘తెలంగాణ నవలా చరిత్ర’ (2017) గ్రంథంలో ఇట్లా రాసిన ‘‘లోకజ్ఞుడు కలం పేరుతో అనేక రచనలు వెలువరించిన ఈయన నల్లగొండ జిల్లా వాడు. సంస్కృతం, ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ, మహారాష్ట్ర, కన్నడ, ఇంగ్లీష్‌ భాషలు స్వయంగా నేర్చుకోవడమే గాకుండా అందులో కవిత్వం చెప్పిన దిట్ట శేషభట్టరు’’. అదీ ఆయన ప్రతిభ. ఈ ప్రతిభావంతుడిని తెలుగు సాహితీ ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- సంగిశెట్టి శ్రీనివాస్



fsar Mohammed, Nawian Samala and 7 others
4 comments
Like
Comment
Share

Comments

View 1 more comment

Vattikota natikalu