Friday, June 19, 2020

వందేండ్ల కిందటి మన సంస్కర్తలు


మన గొప్ప మనం చెప్పుకుంటే అది హెచ్చులు/ఏతులుగా అనిపిస్తయి. అదే విషయాన్ని వేరేవాళ్ళు జెబితే దానికి ఆమోదనీయత, గౌరవం రెండూ ఉంటాయి. హైదరాబాద్‌ రాజ్య సంస్కర్తల గురించి ఆంధ్రాకు చెందిన కుసుమ ధర్మన్నరికార్డు చేసినంత గొప్పగా తెలంగాణ వాళ్ళు కూడా రికార్డు

Add caption

చేయలేదు. కుసుమ ధర్మన్న స్వయంగా హైదరాబాద్‌లో అప్పటి రాజకీయ నాయకుడు, హైదరాబాద్‌ అంబేడ్కర్‌గా ప్రసిద్ధి గాంచిన బి.ఎస్‌. వెంకటరావు అతిథిగా చాలా ఏండ్లున్నాడు. ఆయన దగ్గర పౌర సంబంధాల అధికారిగా పనిచేసిండు. ఈయనకు 1921 కన్నా ముందు నుంచే హైదరాబాదీ నాయకుతో సంబంధాలన్నాయి. బి.ఎస్‌.వెంకటరావు 1946 ఆ ప్రాంతంలో హైదరాబాద్‌ రాజ్య ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అంబేడ్కర్‌ విద్యాసంస్థల స్థాపనకు చేస్తున్న కృషికి మంత్రిగా తోడ్పాటు నందించారు. అందుకోసం ప్రత్యేకమైన ఫండ్‌ని ఏర్పాటు చేసిండు. ఈ వెంకటరావు సాన్నిహిత్యంతోనే 1921 నాటికే కుసుమ ధర్మన్న ఉద్యమకారుడిగా మారిండు. తర్వాతి కాలంలో ఆయన ప్రభావంతోనే దళితులు ఇస్లాం మతంలోకి మారి తమ ఆత్మగౌరవాన్ని రక్షించుకోవాలని పిలపునిచ్చిండు. 1937లో రాజమండ్రిలో జయభేరి అనే పత్రికను ఏర్పాటు చేసి దళితుల అభ్యున్నతికి కృషి చేసిండు. వృత్తిరీత్యా వైద్యుడైన ధర్మన్న అనేక ఊర్లు తిరుగుతూ ఒక వైపు వైద్యం మరోవైపు ఉద్యమ ప్రచారం చేసిండు. ఈయనకు స్ఫూర్తి ఆంధ్రా ప్రాంతం, మదరాసు ప్రావిన్స్‌ నుంచి గాకుండా హైదరాబాద్‌ రాజ్యం నుంచి అందింది.

జిల్లా చరిత్రలకు ఆద్యుడు శేషభట్టర్

జిల్లా చరిత్రలకు ఆద్యుడు శేషభట్టర్
తెలంగాణలో బహుశా మొత్తం తెలుగు లోనే వెలువడ్డ మొట్ట మొదటి జిల్లా చరిత్ర గ్రంథం ‘శ్రీ నల్లగొండ చరిత్రము’. దీని రచయిత శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యులు. ఈ గ్రంథం మొట్టమొదటి సారిగా 1919లో నల్లగొండలో తాను స్థాపించిన ‘శ్రీ వీరేశలింగ కవి కంఠాభరణ గ్రంథమాల’ తరపున మొదటి గ్రంథంగా (1921) వెలువరించాడు. అంతకు రెండేండ్ల ముందు చనిపోయిన కందుకూరి వీరేశలింగం పేరిట ఈ గ్రంథమాల స్థాపితమయింది. ‘‘దేశోపకారమే పరమావధిగానెంచి క్రీ.శ. 1919.లో నీ గ్రంథమాల స్థాపింపబడినది. ఇందు దేశాభివృద్ధికిని భాషాభివృద్ధికిని మిక్కిలి యావశ్యకములైన యుద్గ్రంథములు మూడు నెలలకొకటి చొప్పున బ్రచురించెదము’’ అని పుస్తకం వెనక అట్టపై పేర్కొన్నారు. ఈ గ్రంథమాల నిర్వహణలో నీలగిరి పత్రిక సంపాదకులు షబ్నవీస్‌ వెంకటరామనరసింహారావు, కొండగడప (నల్లగొండ జిల్లా) జాగీర్దారు అక్కినేపల్లి జానకిరామారావు (1885-1975)లు సహాయ పడ్డారు. ఈ గ్రంథమాల తరపున రాబోవు పుస్తకాలుగా చిల్లరిగె శ్రీనివాసరావు నవల శ్రీధర విజయము, బ్రాహ్మణ సాహసము (రెండవ భాగము- బహుశా ఒద్దిరాజు సోదరుల గ్రంథం) పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ ‘శ్రీ నల్లగొండ చరిత్రము’ పుస్తకంలో నమోదయ్యాయి. ఈ పుస్తకం కేవలం 30 పేజీల్లోనే వెలువడ్డప్పటికీ ఇందులో ఇప్పటి వరకు నల్లగొండ గురించి చరిత్రకెక్కని చాలా అంశాలు రికార్డయ్యాయి.
శేషభట్టర్‌ లభ్యరచనలన్నింటిని (భావ ప్రపంచము మినహా) విమర్శకులు, సాహితి చరిత్ర కారులు శ్రీరంగాచార్య గారు తమ సంపాదకత్వంలో 2018లో పుస్తకంగా తీసుకొచ్చారు. గ్రంథ రచయిత సంతానం తోడ్పాటుతో ‘శేషభట్టర్‌ వెంకట రామానాజాచార్యుల (లోకజ్ఞుడు) రచనలు’ పేరిట ఈ పుస్తకం అచ్చయ్యింది. ఇందులో రుక్మిణి (1916-నవల), ప్రాకృత దాంపత్యము (1918-నవల), అఖిల భారత తస్కర మహాసభ (1940 ప్రాంతం- పానుగంటి సాక్షి వ్యాసాల మాదిరి రచన), నల్లగొండ చరిత్రము (1921-చరిత్ర) ప్రేమ బలము (లఘు నాటిక), మౌఢ్య మహిమ (1910- నాటకం) రచనలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఇవి గాకుండా శేషభట్టర్‌ ‘కర్మస్థలము’, ‘ఆంధ్రవీర ప్రబోధము’, ‘హాస్య నాటికలు’, ‘హిందూ దేశ చరిత్ర’ (నాటకం), ‘బహెరెనూర్‌’ (నవల), ‘ప్రకృతి కన్య’ (నవల) గ్రంథాలు ఆయన రచనలుగా రికార్డయ్యాయి. అలాగే ఈయన ‘అఖిల భారత తస్కర మహాసభ’ అనే వ్యంగ్య రచన కూడా చేసిండు. వీటితో పాటు ఆయన 1920-40 మధ్య కాలంలో నీలగిరి, తెనుగు పత్రిక, సుజాత, గోలకొండ పత్రికల్లో అనేక పద్యాలు రాసిండు. అందులో అస్పృశ్యత నివారణపై రాసినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సి ఉన్నవి.
తన సంపాదకత్వంలో వెలువడ్డ ‘శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యుల రచనలు’ కాపీనొకదాన్ని శ్రీరంగాచార్య సారు నాకిస్తూ చదివి దాని మీద రాయమన్నారు. ఇన్నాళ్ళు కుదురలేదు. ఈ కరోనా సమయంలో దాన్ని చూడడమయింది. అయితే ‘నల్లగొండ చరిత్రము’ పుస్తకములో కొన్ని పేజీలు అచ్చులో మిస్సయినాయి. అవి ఆ గ్రంథానికి విలువని జోడించేవి.
ఈ నల్లగొండ చరిత్రములో ఆ పట్టణానికి, జిల్లాకు సంబంధించిన అనేక వివరాలున్నాయి. 1800 ఆ ప్రాంతంలో నుంచి నల్లగొండలో జనావాసం పెరుగుతూ వచ్చిందని, అంతకుముందు ‘పానగల్లు ’ ప్రధాన పట్టణమని పేర్కొన్నాడు. 17వ శతాబ్ది ఆరంభంలో ఇక్కడ ప్రతి గురువారం జరిగే సంతలో దాదాపు 70, 80 వే రూపాయల వ్యాపారం జరిగేదని పేర్కొన్నాడు. ఇంతవరకు ఆధునిక చరిత్రలో సరిగ్గా రికార్డు కాని చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. అందులో ప్రధానమయింది. కుతుబ్‌షాహి రాజుకు నల్లగొండ దుర్గాధీశుడు హరిశ్చంద్రుడుకు సంబంధించిన యుద్ధం. దీని గురించి ఈ గ్రంథంలో శేషభట్టర్ ఇట్లా రాసిండు.
‘‘1516లో (నిజానికి అది 1519- అసలు పుస్తకములో అసీసు తప్పుగా 516 అని ఉంది) ‘బహమన్‌ షాహీ’ రాజ్య మంతరించి ‘కుతుబ్‌షాహీ’ రాజ్యకాల మారంభమాయెను. ఈ రాజ్య స్థాపకుడైన ‘మొహమ్మదు కులీకుతుబ్‌షా’ తన రాజ్యమును ధృడపరచు కొనుటకై బయలు వెడలి గోల్కోండ నుండి తూర్పు సముద్రము వఱకు పానగల్లు, మచిలీబందరు, రాజమండ్రి, రాజుకొండ, కొండపల్లి, వేలూరు, మొదలైన 70 జిల్లాలను జయించెనట. అందు నల్లగొండ దుర్గమును గురించి యీ ప్రకారముగా చెప్పబడినది:
కుతుబుషా బహు సైన్య యుక్తుడై నల్లగొండ దుర్గము నావరించి యుండెను. ఆ కాలమున నీ దుర్గమును హరిశ్చంద్రుడను రాజు (దుర్గము పునర్నిర్మాణము చేసిన వాడు) పాలించు చుండెను. హరిశ్చంద్రుని ధైర్య సాహసము వలనను దుర్గము యొక్క బలిష్టత వలనను కుతుబుషా యెంత ప్రయత్నించినను విజయము సమకూడునట్లు కాన్పించదాయెను. అనేక దినము ముట్టడి వలన యిరుదెగ వారును విసువు జెంది యుద్ధమంత మొందిన బాగుండునని దలంచు చుండిరి. కుతుబుషా సంధి చేయనెంచి యీ వార్త రాజునకు జెప్పబంపెను. అతడును దాని కొఱకే నిరీక్షించు చున్నవాడు గావున తాను పాషాకు సామంతుడుగ నుండుట తన కిస్టమే యనియు షా తనయెడల క్రోధ భావము మాని స్నేహ భావము బూన వలయునని యుంజెప్పి యనేకమగు విలువ గల కానుకతో గూడ తన రాయబారిని కుతుబుషాహ వద్దకి బంపెను. షాహ సైతమా రాయబారిని తగురీతిని సన్మానించి తన మనసున నిట్లని వితర్కించెను. ‘‘నేనిన్ని దినముల నుండి ఈ చిన్న దుర్గమును ముట్టడి వేసియు దీనిని జయింపలేక సంధిచేసుకొని పోవుట నా రాజ గౌరవము కర్హమయిన పనిగాదు. ఏట్లయినను దీనిని వశపరుచుకో వలయును’’ ఇట్లు వితర్కించి రాయబారిని తిరిగి పంపివేయు నప్పుడతనితో ఓయీ! మీ రాజుతో నా మాటలుగా నిట్లుల చెప్పుము. ‘‘ఇప్పుడు మన కిద్దఱకును సంధి కుదిరినది కావున మన మన్యోన్య స్నేహితులము. నల్లగొండ దుర్గము అత్యున్నతమై శత్రువుకగమ్యమై కాన్పించు చున్నది. ఇట్టి యద్భుత విషయమును నీ మిత్రుడునగు నేను చూచిపో నిచ్చగించితి’’ నని చెప్పెను. హరిశ్చంద్రుడా మాటల వలన కుతుబుషా దురుద్దేశ్యమును తక్షణము గ్రహించి యాతని కిట్లు చెప్పి యంపెను.
‘‘మీరు మీయిష్ట ప్రకారమే దుర్గము జూచి వెళ్ళవచ్చును.’’ కాని మీ వెంట మాత్రము కొందరు ముఖ్యానుచరులు తప్ప సైన్య మేదియు నుండరాదు.’’ ఇట్లు చెప్పి పంపి తన దుర్గ రక్షకులకు యాతనిని కైదు చేయవలయునని గట్టి తాకీదు చేసెను. వారునుతమ కార్యము నందు ప్రమత్తులయి యేయుండిరి. అయినను దైవ బలము లేనప్పుడు మనుష్య ప్రయత్నము నిరర్ధకమగును గదా కుతుబుషా కొందరు మెఱియలవంటి యనుచరులను వెంట నిడుకొని దుర్గద్వారము గుండ లోనికి బోయి యచ్చటి ద్వార రక్షకులను జెండివైచెను. అప్పుడు ద్వారమును బంధించువారెవరునూ లేక పోగా నది వఱకే కుతుబుషా ఆజ్ఞవలన సన్నద్ధులై వచ్చుచున్న యాతని భటులు లోనికి జొరబడిరి. అప్పుడిరు తెగ వారికి పోరు ఘోరమయ్యెను. తెలుగు భటులు స్వల్పముగా నుండుటచే కుతుబుషా సైన్యము వారందరిని నాడు నిశ్శేషముగా సంహరించెనట! హరిశ్చంద్రుడు కైదు చేయబడి అటు పిమ్మట వేంకటగిరి సంస్థానాధిపతిగా జేయబడెననియు నిప్పటికిని, ఆ సంతతివారే దానికి రాజుగా నున్నారనియు నొకరు వ్రాయు చున్నారు’’ అని ఉర్దూ పుస్తకాల ఆధారంగా శేషభట్టర్‌ గారు రాసిండ్రు. ముందుమాటలో ‘మౌల్వీ మొహమ్మద్‌ సుల్తాన్‌ రాసిన ‘జొగరాఫియా దక్కన్‌, సయ్యదు అహమదలీ రాసిన ‘తారీఖె నల్‌గొండ’ పుస్తకాలు ఉపయోగ పడ్డాయని ఇందులో పేర్కొన్నాడు. ఇదంతా నల్లగొండ చరిత్రకు కొత్తగా ఉపయుక్తమయ్యే అంశం. నల్లగొండ చారిత్రాభిమానులు పూనుకొని వీటిని పరిశోధించాల్సిన అవసరమున్నది. ముఖ్యంగా ఉర్దూ ఆధారాలను పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు అంతగా వెలుగు లోకి రాని చరిత్రపై వెలుగులు ప్రసరించే అవకాశమున్నది.
అంతా బాగానే ఉన్నది కానీ రంగాచార్య గారు సంపాదకత్వం వహించిన పుస్తకములోని నల్లగొండ చరిత్రలో మూడున్నర పేజీలకు మించి మ్యాటర్ మిస్సయ్యింది. పుస్తకం మొత్తం కలిపి 30 పేజీలు కూడా లేదు. అందులో మూడు పేజీలు మిస్‌ కావడంతో ‘సయ్యద్‌ లతీఫుల్లా ఖాదరీ’ గోరీ, దుర్గ నిర్మాణానికి సంబంధించిన చాలా విషయాలు అచ్చు కాకుండా పోయాయి. సమగ్ర రచనల్లోని పేజి 296, 15 వలైను నుంచి సమాచారం జోడించాల్సి ఉంటుంది. ఒరిజినల్‌ పుస్తకంలోని 15వ పేజీలో రాను రాను భాషా పరిణామ మహత్వ మున ‘నల్లగండి’ ని ‘నల్లగొండ’ యని పిలువజొచ్చిరి. ఈ యూరికీ పేరు వచ్చుటకీ కారణమే విశ్వసనీయముగా గన్పట్టు చున్నది. అని నల దమయంతుల్లోని నలుని పేరిట నల్‌గొండ వచ్చిందనే ఒక ప్రచారాన్ని కూడా పేర్కొన్నారు. కాకపొతే అది అంట విశ్వసనీయం కాదన్నారు. అయితే రంగాచార్య సారు సంపాదకత్వం వహించిన ఈ పుస్తకంలో రాను రాను భాషా పరిణామ..... తర్వాత మ్యాటర్‌ మిస్సయి మళ్ళీ 18వ పేజీలోని ..... మాతయునైన అనే దగ్గరి నుంచి ప్రారంభమయింది. దీన్ని సవరించాల్సిన అవసరమున్నది.
ఇప్పటి యాదాద్రి-నల్లగొండ జిల్లా దత్తప్పగూడెం గ్రామానికి చెందిన శేషభట్టర్‌ ఏప్రిల్‌ 16, 1900వ సంవత్సరంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రామానుజమ్మ కృష్ణమాచార్యులు. ఈయన వకీలుగా మహబూబాబాద్‌, భువనగరి, నల్లగొండ, దేవరకొండ తదితర ప్రాంతాల్లో పనిచేస్తూ చిన్న వయసులోనే అంటే 44 ఏండ్లకే హైదరాబాద్‌లో మే 19, 1944 నాడు మరణించారు.
1927 నాటికే అస్పృశ్య నివారణపై పద్యాలు రాసిన శేషభట్టర్‌ వెంకటరామానుజాచార్య రచనలు ఒక్క దగ్గరి తీసుకు వచ్చినందుకు శ్రీరంగాచార్య గారు ఎంతైనా అభినందనీయులు. ఈ పనికి శేషభట్టర్‌ కుటుంబ సభ్యులు పూనుకోవడం ముదావహం. మిగిలిన రచనలు కూడా వెలుగు వచ్చినట్లయితే ఆయన ప్రతిభ, పాండిత్యం ప్రపంచానికి తెలిసే అవకాశముంటుంది.
శేషభట్టర్‌ గురించి రాసిన ‘తెలంగాణ నవలా చరిత్ర’ (2017) గ్రంథంలో ఇట్లా రాసిన ‘‘లోకజ్ఞుడు కలం పేరుతో అనేక రచనలు వెలువరించిన ఈయన నల్లగొండ జిల్లా వాడు. సంస్కృతం, ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ, మహారాష్ట్ర, కన్నడ, ఇంగ్లీష్‌ భాషలు స్వయంగా నేర్చుకోవడమే గాకుండా అందులో కవిత్వం చెప్పిన దిట్ట శేషభట్టరు’’. అదీ ఆయన ప్రతిభ. ఈ ప్రతిభావంతుడిని తెలుగు సాహితీ ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- సంగిశెట్టి శ్రీనివాస్



fsar Mohammed, Nawian Samala and 7 others
4 comments
Like
Comment
Share

Comments

View 1 more comment

Friday, June 12, 2020

అంతటి నరసింహం

 



అంబేడ్కర్‌ భావజాలాన్ని ఆచరించి

రచనలతో ప్రచారం చేసిన

బహుజనుడు అంతటి నరసింహం

‘‘ఎంతటి వారలైనా నీ అవసరం రానంత వరకే నిన్ను విస్మరిస్తారు.’’
    ఈ విస్మరణ, వివక్షాపూరిత వైఖరి మూలంగా కొన్ని సార్లు వైయుక్తిక నష్టం కన్నా సమాజానికే ఎక్కువ నష్టం జరుగుతుంది. కొంతమంది సాహితీమూర్తులు సృజించిన రచనలను విస్మరించడం వల్ల వారికన్నా ఎక్కువగా మనకే నష్టం జరుగుతుంది. జరిగింది కూడా! అట్ల ఒకతన్ని అతని రచనలను విస్మరించి మనకు మనం నష్టం చేసుకున్నాము. ఆయన పేరు డాక్టర్‌ అంతటి నరసింహం.
Add caption
కడపజిల్లా వెంకటరాజు పల్లెకు చెందిన అంతటి నరసింహం కులం రీత్యా గౌడ్. ఈయన కావ్యాలు, సాంఘిక నవలలు, చారిత్రక రచనలు, నాటకాలు, విమర్శ, బాల సాహిత్యం ఇట్లా అనేక ప్రక్రియల్లో ఆరు దశాబ్దాల పాటు రచనలు చేసిండు. ఇప్పుడిక్కడ ఆయన రాసిన ‘చీకట్లో కాంతి రేఖలు’ అనే నవల గురించి చర్చించుకుందాం.
‘చీకట్లో కాంతిరేఖలు’ నవల మొదట ఆంధ్రభూమి దిన పత్రిక ఆదివారం అనుబంధంలో సీరియల్‌గా ప్రచురితమయింది. అనంతరం 1982లో పుస్తక రూపంలో వెలువడింది. ఈ నవల 1991లో పునర్ముద్రితమయింది. ఒక నవల రెండుసార్లు అక్కవడం అరుదు. రెండోసారి ప్రచురితమైన నవల ఆధారంగానే ఇక్కడ రాస్తున్నాను.
తెలుగునాట 1985లో కారంచేడు సంఘటన తర్వాత దళితోద్యమం పురుడు పోసుకుంది. ఇది సాహిత్యంలోనూ ప్రతిఫలించింది. ఆ తర్వాత 1990లో పూలె శతవర్ధంతి, అనంతరం 1991లో అంబేడ్కర్‌ శతజయంతి, మండల్‌ ఉద్యమం, బహుజన సమాజ్‌ పార్టీ కార్యకలాపాలు అన్నీ కలిసి దళిత చైతన్యానికి పాదులు వేశాయి. అయితే ఇవేవి లేని సమయంలోనే అంతటి నరసింహం ‘చీకట్లో కాంతిరేఖలు’ అనే చారిత్రక, రాజకీయ, దళిత చైతన్య నవలను రాసిండు. నవలా నాయకుడు దళితుడు. మాల కులస్థుడు. పేరు కాంతారావు.
    ఈ కాంతారావు ప్రాథమిక విద్య నుంచి ఐఎఎస్‌ అధికారిగా ఎదిగి వచ్చే క్రమాన్ని అంతటి నరసింహం అత్యంత సమర్ధంగా చిత్రించిండు. చాలా విషయాలు తాను స్వయంగా చూసినవి కావడంతో వాటికి జీవం పోసిండు. ఈ నవల చాలా రకాలుగా కొత్త పుంతలు తొక్కింది. ఇందులోని కథ 1930-1958 మధ్య కాలంలో గుంటూరు, హైదరాబాద్‌ రాజ్యం, మదరాసు చదువులూ, అమెరికా రాక పోకలు, దళితులపై దాడులు, పొగాకు కూలీలు, వారిపై అత్యాచారాలు, క్రైస్తవం, మతమార్పిడులు, మాల-మాదిగల విభేదాలు, వారిమధ్య సయోధ్యకు కృషి, కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ రాజకీయాలు, తెలంగాణ-ఆంధ్ర సంబంధాలు, రజకార్లు, సాయధ రైతాంగ పోరాటం, ఆంధ్రాధిపత్యం, విద్య ప్రాధాన్యత, దళితుల ఆత్మగౌరవం, మదరాసులో దళితులకు కిరాయికి ఇండ్లు దొరకని స్థితి, తెలంగాణలోదొరలదౌర్జన్యాలు, దళితుల ఉన్నతచదువులు, కులఅంతరాలు- ఇట్లా అనేక విషయాలను మేళవించి దలోతుల జీవితాలను చిత్రించిండు.
అన్నిటి కన్నా ప్రధానంగా కాంగ్రెస్‌ వాదిగా బయలుదేరిన వ్యక్తి మధ్యలో కమ్యూనిస్టుగా అదీ తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకి పట్టుకొని ప్రత్యక్షంగా పట్టుకున్న వ్యక్తి 1956 నాటికే అంబేడ్కరిస్టుగా, ఐఏఎస్ గా ఎదిగిన తీరు, సమాజంలో వచ్సిన మార్పును పొల్లు పోకుండా కండ్లముందుంచిండు. మొదట్లో గాంధీ-అంబేడ్కర్‌ ఇద్దరినీ అభిమానించిన వ్యక్తి ఆఖరికి అంబేడ్కర్‌ దగ్గర వచ్చి ఆగిన తీరుని ఇందులో రాసిండు.
ఇదొక విశిష్టమైన నవల. ఎందుకంటే నవలాకారుడిది రాయలసీమ. కథా నాయకుడు గుంటూరు వాసి. ఈయనకు స్ఫూర్తి, గురువు తెంగాణకు చెందిన కమ్యూనిస్టు, మాలదాసరి. అనంతరం ఈ మాలదాసరి 1952 ఎన్నికల్లో గుంటూరు జిల్లా రిజర్వుడు నియోజక వర్గం నుంచి కమ్యూనిస్టు పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇట్లా ఈయన విజయానికి తోడ్పడింది తెలంగాణలో రజకార్ల దోపిడీలో సర్వం కోల్పోయిన భూస్వామి కూతురు. ఈమె పేరు శశి. ఈమె తర్వాతి కాలంలో అంటే 1952-53 నాటికే అమెరికా వెళ్ళి అక్కడ చదువుకుంటుంది. అక్కడ ఉద్యోగం కూడా చేస్తుంది. దళిత కథానాయకుడు - శశి మధ్యన ప్రేమ, ఆత్మాభిమానం గురించి రచయిత చక్కగా అక్షరాలుగా చెక్కిండు. కాంతారావు అమెరికా వెళ్ళినపుడు అక్కడి హోటల్‌ యాజమానులు ‘కుక్కల-, ఇండియన్లకు’ ప్రవేశం లేదు అని రాయడాన్ని వ్యతిరేకిస్తాడు. ఇట్లా రచయిత కథానాయకుడు ఇండియాలోనూ, అమెరికాలోనూ ఎదుర్కొన్న వివక్షను అక్షరబద్ధం చేసిండు.
    ‘‘కాంతారావుది గుంటూరు ప్రక్కన పల్లె. పల్లెగాదు, పల్లె ప్రక్కన హరిజనవాడ. [హరిజన పదం వాడకాన్ని ఇప్పుడు నిషేధించారు.] ఇతరుల దృష్టిలో హరిజన వాడేగాని అది రెండుగా చీలి వుంది. ఒకటి మాలవాడ, రెండవది మాదిగవాడ. మాల వాడకు చెందిన వాడు కాంతారావు’’ అని కథా నాయకుడి గురించి చెబుతాడు.
అదే సమయంలో కథా నాయకుడు కాంతారావు తన ఊరు (గుంటూరు పక్కనే ఉండే ఊరు)లో యువకు కోసం రాత్రి పాఠశా నిర్వహించడం, మా`మాదిగ మధ్యన మైత్రి కోసం ప్రయత్నించడం, దళిత బాలిక విద్య కోసం కృషిచేయడం, గ్రంథాయోద్యమంలో నేరుగా పాల్గొనడం కూడా రాసిండు.
దళితులే ఎక్కువగా కమ్యూనిజం వైపు మళ్ళిన విషయాన్ని కూడా నరసింహం గారు రాసిండ్రు. ‘‘మనదేశంలో హరిజనులు కమ్యూనిజం వైపు మొగ్గు చూపినంతగా మరే జాతీ చూపదు. కమ్యూనిజంలో సమతాభావం వుంది. అది బీద వర్గాల పక్షం వహిస్తుంది. కర్షక కార్మిక పక్షంగా వుంటుంది. కుల మతాలుండరాదని ఆచరణ రీత్యా చూపుతున్న పార్టీ అది అప్పట్లో’’ అని ఆనాటి కమ్యూనిస్టు పార్టీ గురించి చెప్పిండు.
అట్లాగే గాంధీ హత్య గురించి కూడా ఇందులో రాసిండు.
‘‘త్వరగా భోంచేసి పాఠశాలకు వెళ్ళాలని భోజనం ముందు కూర్చున్నాడు. అన్నం కలిపి ముద్ద నోటికెత్తబోతున్నాడు. సోమన్న గసపెట్టుకుంటూ పరుగెత్తుకొని వస్తున్నాడు. కన్నీళ్ళు కారుతున్నాయి. యేడుస్తూ గాద్గదిక స్వరంతో చెప్పబోతున్నాడు. మాట పెగిలి రావడం లేదు. కాంతారావు గాభరాగా ‘‘ఏమిటిది సోమన్నా?’’ అన్నాడు. అతి ప్రయత్నంతో ‘‘గాంధీజీ హత్య’’ అన్నాడతను. ఏం వింటున్నాడో కాంతారావు అన్నం అట్లానే వదిలేసి లేచాడు. ‘‘ఏమిటంటున్నావ్‌?’’ అన్నాడు నమ్మనట్లుగా.
‘‘గాంధీజీని హత్య చేశాడు ఒక మత మూర్ఖుడు?’’
‘‘ముస్లిమేనా’’
‘‘ఛీ! ఛీ! హిందువే. ఒక కులతత్త్వవాది.’’
అంతే! చెయ్యి కడుక్కొని యాంత్రికంగా మౌనంగా గుంటూరు పరుగెత్తారు. గుంటూరులో ప్రతి రేడియో కూడా విషాద సంగీతం వినిపిస్తున్నది. ‘రఘుపతి రాఘవ’ అని ఆలాపన చేస్తున్నది.’’ (చీకట్లో కాంతిరేఖలు: 56) అని గాంధీ హత్యను రికార్డు చేసిండు.
```
1948లో తెలంగాణలో సాయుధ పోరాటం ఊపందుకోవడంతో తన స్ఫూర్తిప్రదాత ‘దాసు పంతులు’తో పాటు స్వయంగా తుపాకి పట్టిండు. నైజాం సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా దాసుపంతులు పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడిండు. అట్లాగే సూర్యాపేటకు దగ్గరలోని జగన్నాథపురంలో రజాకార్లు దోపిడికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకొని సాయుధ కమ్యూనిస్టులు అక్కడికి చేరుకున్నారు.అప్పటికే రజాకార్లు గడీలో దొరను చంపేసిండ్రు. ఆయనతో పాటు ఇంట్లో ఉన్న వారినందరిని చంపేసిండ్రు. అయితే కాంతారావు సాహసంతో వ్యవహరించి అక్కడ చిక్కుకు పోయిన భూస్వామి కూతురు శశిని రక్షిస్తాడు. తర్వాత ఆమెను సంస్కరణ భావాలు గల పోలీసు దంపతులు గుంటూరులో తమ దగ్గరే ఉంచుకొని చదివిస్తారు. స్థూలంగా ఇదీ కథ. అయితే ఇందులోనే ఎన్నోఉపాంగాను అంతటి నరసింహం చేర్చిండు.
సాయుధ పోరాట కాలం నాటి తెలంగాణ ప్రజల జీవితాలను చాలా చక్కగా అక్షరబద్ధం చేసిండు. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని, ఆంధ్రా అధికారుల దోపిడీ మనస్తత్వాన్నీ చిత్రించిండు. తెలంగాణ ప్రజల పట్ల పూర్తి సానుభూతి, సహానుభూతితో రాసిండు. పోలీసు చర్య నాటి జీవితాలను ఇట్లా చిత్రించిండు. ‘‘తెలంగాణ ప్రజానీకం చాలా వెనుకబడిన సమాజం. దారిద్య్రంలో అజ్ఞానంలో మునిగి ఎన్నెన్నో కష్టాలను తమ పూర్వజన్మ కర్మ అనుకుంటూ అనుభవించిన అమాయక జనం. కమ్యూనిస్టు అండా, వారు స్థాపించిన గ్రామ రాజ్యమూ కొంత ఊరట కలిగించినా ఎ్లప్పుడూ సింహ వ్యాఘ్రాది క్రూర జంతువుల భయంచేత నిత్య జాగరూకతతో ప్రవర్తించే జింకల్లాగా భూస్వాములా రజాకార్లా దాడులను శంకిస్తూ వుండే నిస్సహాయ జనం. సైన్యాన్ని చూచి ఆనందించిన యీ జనం వారి ఘాతుక చర్యలను చూచి నిర్వేదం పొందింది.
పుండు మీద కారం చల్లినట్లుగా పాలకుల దుర్మార్గం కూడా తోడయింది. నిజాం రాజ్యాన్ని సైన్యాలు మూడు దినాల్లోనే స్వాధీనం చేసుకోగానే యూనియన్‌ ప్రాంతాల నుండి, ముఖ్యంగా మద్రాసు రాష్ట్రం నుండి అడ్మినిస్ట్రేషన్‌ కోసం కొందరు డిప్యూటి తహసిల్‌ దార్లను తహిసిల్‌దార్లుగాను, తహసిల్‌దార్లుగా వున్న వారిని డిప్యూటి కలెక్టర్లుగానూ, సబ్‌ ఇన్‌స్పెక్టర్లను ఇన్‌స్పెక్టర్లుగానూ, ఇన్‌స్పెక్టర్లను డిప్యూటి సూపర్నెంట్లుగాను ప్రమోషన్‌ ఇచ్చి తెంగాణాకు పంపారు. నిజాం రాష్ట్ర ఉద్యోగులో అధికాంశం ముస్లిములే గాబట్టి వారి చేతుల్లో అణగారిపోయాం అనుకుంటున్న గ్రామీణ హిందూ ప్రజానీకం యీ అడ్మినిస్ట్రేటర్లను చూచి ఎంతో ఆనందించి హృదయత: స్వాగతం పలికారు. దేవుళ్ళను చూచి మొక్కినట్లుగా నమస్కారం చేస్తూ, ఇక తమ కష్టాులు శాశ్వతంగా తొలగి పోయాయని భావించారు. కాని వ్యక్తి వ్యక్తి స్వార్థ చిత్తుడై వ్యక్తి స్వార్థం కులస్వార్థం అనే మురికి గుంటల్లో నివసిస్తూ యీ అధికారి మండూకాలు నాలుకలు చాచి చిన్న చిన్న కీటకాల్లాంటి యీ జనంపై బడి భక్షించసాగారు.
ఇదిరకటి వారు దండయాత్రలాగా వచ్చి పాడు చేసి వెళ్ళిపోయారు. ఇపుడు వచ్చిన వీరు స్థిరంగా ఒక చోట వుండి నిదానంగా భక్షింపసాగారు. లంచగొండితనం ఎంత పరాకాష్ఠనందుకుందో ఆ ప్రజలకు అర్థమయింది. యూనియన్‌ అడ్మినిస్ట్రేటర్ల ధనదాహం చెప్పనలవి కానిది. అక్కడ వున్న భూస్వాములపైనా బహీనవర్గాలపైనా వివక్ష లేకుండా పడి దోచుకోవడమే వారి పని! ప్రతివాడూ వాడికి తగిన విధంగా దోచుకోవడమే. సర్వభక్షకుల్లాగా తయారైపోయారు. ఇక వీరి కామదాహం వర్ణనాతీతం. హిందూ ముస్లిం భూస్వాముల యిండ్లలో వచ్చి పసుపు కొమ్ముల్లాంటి అందమైన ఆడవాళ్ళనూ తటస్థపడిన ఆడవాళ్ళనూ బొమ్మల్లాగా వుపయోగించుకున్నారు.
ఇది వరకు రజాకార్ల క్రౌర్యానికి తట్టుకోలేక యూనియన్‌ ప్రాంతాకు పారిపోయిన వాళ్లంతా తిరిగి తెలంగాణలోకి నిర్భయంగా ప్రవేశించారు. తీరావచ్చి ఇక్కడి పరిస్థితులు చూచి విస్తుపోయారు. యూనియన్‌ ప్రాంతాల్లో ముఖ్యంగా గుంటూరు బెజవాడ మొదలైన పట్టణాల్లో ప్రాణాలను అరచేత బట్టుకొని పారివచ్చిన తెలంగాణ వారినుండి బాడుగలు అధికంగా లాగడం ద్వారా అధిక ధరలకు మోసంగా వస్తువులు నమ్మడం ద్వారా దగా చేయడం చూచిన యీ శరణార్థులు తిరిగి వచ్చి, తమ వారంతా అధికార్ల చేతుల్లో అనుభవిస్తున్న కడగండ్లను చూచి విస్మయం చెందారు. అదే అప్పటి నుండే ఆంధ్ర ప్రాంతం వారంటే తెంగాణ వారికి మంటలెత్తడం మొదలు.’’ (చీకట్లో కాంతిరేఖలు: 110-111)’’ దీన్ని బట్టి ఆనాటి ఆంధ్రాధికారుల అఘాయిత్యాలు, దోపిడి, దౌర్జన్యం తెలుసుకోవచ్చు. ఇట్లాంటివే అనేక సంఘటనలు అంతటి నరసింహం గారు ఈ నవలలో రాసిండ్రు. మదరాసు పట్టణంలో దళితులకు కిరాయికి ఇండ్లు ఇవ్వని విషయాన్ని, దళితులకు బుద్ధి చెప్పడం కోసం పొగాకు రైతులు సమ్మె చేస్తున్న వారిని బెదిరించడం. అత్యాచారాలకు ఒడిగట్టడం, అత్యాచారాలు చేసి అనివార్య పరిస్థితుల్లో దండుగలు కట్టి ఎట్లా దొరలు లైంగిక దాడికి దిగేవారో రాసిండు. కుల మతా తారతమ్యాలు, అవి పోవడానికి చేయాల్సిన కృషి, కులాంతర వివాహాల ప్రసక్తి ఇట్లా అనేక విషయాలు ఈ నవలలో ఆయన చిత్రించిండు.
- - -
‘‘సమాజాన్ని నడిపించేది నీతి. నీతి అంటే, అదేదో పాతచింతకాయ పచ్చడి అనీ, వేదాంతులకు అవసరమైన పదం అనీ, అనుకోగూడదు. అది ప్రతినిత్యమూ సంఘావసరాన్ని బట్టి మారుతూ సమాజాన్ని ముందుకు నడిపించే చుక్కాని లాంటిది. నిత్యగమనం గలది.
ప్రతి వ్యక్తి జీవితమూ, సంఘర్షణమయమే. స్వార్థమయమే! స్వార్థం యెప్పుడూ అసూయా ద్వేషాలకూ, అక్రమ ప్రవర్తననూ, దారితీస్తూనే వుంటుంది. తత్ఫలంగా సంఘర్షణ జనిస్తుంది. ధనసంచయమూ, కామతృష్ణా, పరిశ్రమ చెయ్యకుండా సుఖజీవిత వాంఛా, భావితరాల సుఖజీవనం కోసం ఆస్తి కూడబెట్టడం వగైరాలు ఈ స్వార్థానికి ఆలంబనాలు’’ అని అంతటి నరసింహం ఈ నవలకు రాసిన ముందుమాటలో చెప్పిండు. అట్లాగే ‘‘ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం. సమాజంలోని అందరికీ సమజీవనం అనుభవించాల్సిన హక్కుంది. అందుకు అవాంతరాలు యేర్పడితే వాటిని తొలగించుకోవసిన హక్కుగూడా అందరికీ వుంది. అయితే అంత చైతన్యం అందరికీ వుండదు. అందుకే రచయితలు ఆ బాధ్యత వహించాలి. రచయితలు ఎప్పుడూ దూరదృష్టి గలవారు. వారికి బాధ్యతున్న విషయం వారు మరువరాదు.’’ అంటూ రచయిత కర్తవ్యాన్ని కూడా చెప్పిండు.
ఆయన కర్తవ్య బోధనే గాకుండా ఆచరించి చూపించిండు. గాంధీ - అంబేడ్కర్‌ రాజకీయాలను, రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌, ఎన్నికలు, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు రాజకీయాలు, ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఇట్లా అనేక రాజకీయ విషయాలను ఈ నవల చిత్రికగట్టింది. కచ్చితంగా ఇది రాజకీయ నవలే. అయితే దళితులకు న్యాయమైన ప్రాతినిధ్యం కోసం కొట్లాడిన రాజకీయ నవల. ఆత్మగౌరం కోసం తండ్లాడిన నవల. ఏ జిల్లాలోనైతే సాయుధ పోరాటంలో తుపాకి పట్టుకొని పోరాటం చేసిండో అదే జిల్లాకు ఓ ఎనిమిదేండ్ల తరువాత ఐఎఎస్‌ అధికారిగా సబ్‌కలెక్టరుగా వచ్చిండు. దళిత ఐఎఎస్‌ దగ్గర అగ్రవర్ణాలకు చెందిన ఫ్యూను సైతం పనిచేయడానికి నిరాకరించిన వైనాన్ని అంతటి నరసింహంగారు రాసిండ్రు. ఇట్లా నిజాయితీగా పనిచేసే అధికారులను శశి చిన్నాన్నఎమ్మెల్యే జగన్నాథం లాంటి వారు అడ్డుకోవడం, ఆఖరికి అక్కడి నుంచి కాంతారావుని తబాదలా చేయించడంతో కథా నాయకుడు అంబేడ్కర్‌ మార్గమే సరైనది. కుల వివక్ష పోవాలంటే కులాంతర వివాహాలు జరగాలని అంతకు ముందు నుంచి చెబుతూ వచ్చాడు. అందుకే కాంతారావు ఇట్లా అభిప్రాయపడ్డాడు. ‘‘ఈ దేశంలో అంబేద్కర్‌ వాదమే బాగుందనుకున్నాడు. ప్రతీకారాగ్ని ప్రజ్వరిల్లింది. ప్యూనుపై కసిదీర్చుకోవాలనుకున్నాడు. డిస్మిస్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా అనుకున్నాడు. వాడి వెనుకవున్న కులవ్యవస్థా, కుల పెద్దలు కారణంగాని వాడు గాదనుకున్నాడు. అయినా క్రమశిక్షణ కోసం చర్య తీసుకోకపోతే ఆ అవమానానికి తల ఒగ్గినట్లవుతుందని, ఎందుకు డిస్మిస్‌ చేయరాదో సంజాయిషీ యివ్వవలసిందిగా ప్యూనుకు వ్రాయించి పంపాడు’’ అని ఆనాటి తీరుపై రాసిండు. స్వాతంత్య్రం వచ్చిన పదేండ్ల తర్వాత కూడా సమాజంలో ఆశించిన మార్పు లేక పోవడంతో ‘‘ఈకుల వ్యవస్థ పాత కుబుసాన్ని విడిచి కొత్త రూపాన్ని ధరిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఏ స్వార్థంతో అయితే యిది పుట్టిందో ఆ కారణాన్ని సమూలంగా నిర్మూలించాలి. రాజకీయ వ్యవస్థ ద్వారానే దీన్ని దెబ్బకొట్టాలి. మహిళా కళాశాల స్థాపన జరగ్గానే రాజీనామా యిచ్చి అయినా కులవ్యవస్థను దెబ్బతీయాలి. ఈ వ్యవస్థ వల్ల ఏ కులానికీ ఏ వర్గానికీ మేలు లేదు కాబట్టి యిది వుండరాదు’’ అని అంబేడ్కర్‌ ఐడియాలజీ పట్ల అభిమానాన్ని కథానాయకుడి ఆఖరి మాటల్లో తన అభిప్రాయంగా అంతటి నరసింహం చెప్పిండు.
దళిత సాహిత్యంపై జరిగిన చరిత్ర, పరిశోధన, విమర్శ, పరామర్శల్లో ఈ నవల గురించి ఏ ఒక్కరిద్దరో తప్ప ఎవ్వరూ పేర్కొనలేదు. అదే సమయంలో ఉన్నవ క్ష్మినారాయణ రాసిన ‘మాలపల్లి’ నవలను ఇటు బ్రాహ్మణులు, అటు దళితులూ ఇద్దరూ చాలా చర్చ చేసిండ్రు. అయితే బహుజనుడు ఒక గౌడ కులస్థుడైన అంతటి నరసింహం రాసిన నవలకు అటు దళిత సాహిత్య చరిత్రలోనూ, ఇటు విమర్శలోనూ పెద్దగా చోటు దక్కలేదు. ఇప్పటికైనా ఈ నవలను పునర్ముద్రించి దీనిలోని విషయాలను దళితులు, బహుజనులు అందరూ పట్టించుకోవాల్సిన అవసరమున్నది. అంబేడ్కర్‌ భావజాలం ఇంత విస్తృతి చెందిన తర్వాత కూడా అంతటి నరసింహం ను విస్మరించడం అన్యాయం. అంబెడ్కర్ భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం 1980లోనే రాసిన ఈ నవలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.
అంతటి నరసింహం ఆదర్శాలు రాయడమే కాదు స్వయంగా ఆచరించిన వాడు. తాను కులాంతర వివాహం చేసుకోదలిచి అదే విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించాడు. ఆయనకు ఆ కాలంలో మూడు ఆదర్శాలుండేవి. ఒకటి అస్పృశ్యతా నివారణ, రెండోది స్త్రీ విద్య, మూడోది కులాంతర వివాహం. ఆఖరికి అపరాజిత అనే అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు.
(కం)కాళరాత్రి అనే పద్య కావాన్ని హైదరాబాద్ వాసి భాషా సేవకుడు ఉన్నతాధికారిఅయిన బహుజనుడుమాటేటి రామప్పకు అంకితమిచ్చిండు. దీనికి తిరుమల రామచంద్ర ముందుమాట రాసిండు.
1925 నవంబర్‌ 24వ తేదీన కడప జిల్లా కోడూరు తాలూకాలోని వెంకటరాజు పల్లిలో అంతటి సుబ్బమ్మ, పెంచలయ్య దంపతులకు జన్మించిన అంతటి నరసింహం తెలుగులో ఎం.ఎ చదవడమే గాకుండా ‘ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు’ అనే అంశంపై వెంకటేశ్వర యూనివర్సిటీలో పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా అందుకున్నాడు. 1946 నుంచి 1976 వరకు అనేక కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ సెక్రెటేరియట్‌లో సాంస్కృతిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శిగా 1976లో నియమితులయిండ్రు. 1982 నుంచి వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సహాయ సంస్థ అభివృద్ధి అధికారిగా, అనంతరం ఎ.పి. వాషర్‌మెన్‌ ఫెడరేషన్‌ మొదటి చైర్మన్‌గా వ్యవహరించారు. హైదరాబాద్‌ మెహదిపట్నంలో నివసించిన ఈయన 2010లో చనిపోయారు.
ఈయన (కం)కాళరాత్రి, నవసృష్టి, తాడితవ్యాఘ్రి, ఇప్పుడే, కాలవేదం, ఉషస్వప్నం, ఇరవై ఒకటో శతాబ్దంలోకి, అవతారాలమోసాలు అనే కావ్యాలు, ఆదర్శం, భావం, ప్రేమ భిక్ష, లేడి లెక్చరర్‌, స్వగతం, శంపాలత, చీకట్లో కాంతిరేఖలు, శోభాదేవి, ఆప్‌బీతీ (హిందీ) నవలలు రాసిండు. సహజీవనం, సమరసత్వం, మానవత్వం, పరిష్కారం, ఎక్కడి గొంగడి అక్కడేనా, మహిళా మహస్సు, వేలం వెర్రి, భువన విజయం, ముక్కంటి ముక్కోణం, నిత్య కళ్యాణి, ముల్లును ముల్లుతోనే ఆనే నాటకాలనూ రాసిండు. ఇంకా ఎంతో బాల సాహిత్యాన్ని సృజించాడు.
తెలుగు సాహిత్యానికి ఇంతటి విశిష్టమైన సేవలందించినఅంతటినరసింహం గురించి ఇప్పుడైనా విశ్వవిద్యాలయాల్లో పనిచేసేవారు దళితోద్యమకారులు, రాయలసీమ సాహితీవేత్తలు బహుజనులు పూనుకొని ఏదయినా యూనివర్సిటీలో ఈ పుస్తకాన్నిపాఠ్యాంశంగా పెట్టించినట్లయితే విద్యప్రాధాన్యత వస్తుంది. ఈ స్ఫూర్తితో మరింత మంది ఐఎఎస్ లుఅవకాశముంది. ఈ 312 పేజీల నవల త్వరలోనే పునర్ముద్రణ కావాలని కోరుకుంటూ..
                                                                                                     - సంగిశెట్టి శ్రీనివాస్

Wednesday, June 10, 2020


Article On Jotirao Phule follower and his friend, foundder member of Satyashodhak samaj Tukaram Tatya podwal biographical details or given below.. follow..

మహత్మ జోతిరావు పూలె అనుచరుడు భండారి (గౌడ) కులస్తుడు తుకారాం తాత్య కుల వివక్షపై ఇండియాలో తొలి సారిగా 'జాతిభేద్ వివేక్ సార్ ' అనే పుస్తకాన్ని 1861లో రాసిండు. దీన్ని 1865లో పూలె పునర్ముద్రించిండు.. అవిశ్రాంత బహుజన సంస్కర్త గురించి చదువండి..

Friday, June 5, 2020

నిరంతర సత్యాన్వేషకులు, పరిశోధకులు, అధ్యాపకులు మిత్రులు వెల్దండ నిత్యానందరావు పుస్తకం పై నా సమీక్ష- మూసీ పత్రికలో



నా గురించి దక్కన్ లాండ్ పత్రికలో రాసిన వ్యాసం




భారత కార్మికోద్యమ పితామహుడు లొఖండె Article On Deenabandhu Editor Father of Indina labour movement, Bahujan Leader Narayana Meghaji Lokhande


భారత కార్మికోద్యమ పితామహుడు లొఖండె

ఇవ్వాళ మేడే. (May 1, 2020) (కార్మికుల దినోత్సవం. అమెరికాలోని షికాగోలోని హేమార్కెట్‌లో జరిగిన ఉద్యమాల స్ఫూర్తితో 1886 నుంచి ప్రపంచమంతటా మే ఒకటో తేదిని ‘కార్మికుల దినోత్సవం’గా జరుపుకుంటున్నారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో ఇండియాలో కమ్యూనిస్టులు, వారి అనుబంధ సంఘాలు, మిగతా అన్ని పార్టీలకు అనుబంధంగా నడుస్తున్న కార్మిక సంఘాలు మే -1’ని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సంతోషం. అయితే దేశంలో మొట్టమొదటిసారిగా కార్మికసంఘాలను నిర్మించి నడిపించిన నారాయణ మేఘాజీ లొఖండేను మాత్రం ఏమాత్రం గుర్తు చేసుకోరు. ఎందుకంటే శ్రీపాద అమృత డాంగె లాంటి బొంబాయి కార్మిక, కమ్యూనిస్టు, బ్రాహ్మణ నాయకుల కృషిని ఇది దిగదుడుపు చేస్తుంది. అంతేకాదు లొఖండే బీసీ కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం. ఇట్లాంటి సమయంలో బహుజన స్ఫూర్తి ప్రదాతలను బహుజనులే పూనుకొని ప్రచారంలో పెట్టాలె. పాఠ్యపుస్తకాల్లో వీరి జీవిత చరిత్రలను జోడించేందుకు కొట్లాడాలె. వారి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలె.


పూలెతో కలిసి ‘సత్యశోధక్‌ సమాజ్‌’ని నిర్మించిన నాయకుడు, దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్మిక సమస్యలను బహుజన దృక్కోణంలో వెలుగులోకి తేవడానికి, పరిష్కరించడానికి ‘దీనబంధు’ అనే పత్రికను నడిపించిండు. ఆయన గురించి మొట్టమొదటిసారిగా మరాఠీయేతర ప్రజలకు తెలిసింది 1960లో మాత్రమే! ధనంజయకీర్‌ రాసిన ‘సామాజిక విప్లవకారుడు మహాత్మ పూలె’ (1960) పుస్తకంలో కొంత సమాచారమిచ్చిండు. మనోహర్‌ కదమ్‌ అనే మరాఠీ చరిత్రకారుడు, రచయిత ఆయన జీవిత చరిత్రను 1995లో రాసి ప్రచురించిండు. మనోహర్ కదమ్ “బొంబాయి నిర్మాణములో తెలుగువారు” నేపుస్తకాన్ని కూడా రాసిండు. మనోహర్ రాసిన లోఖండ్ జీవిత చరిత్ర ఆధారంగా నళిని అనెస్కాలరు ఒక వ్యాసం రాసింది. ఆమె లొఖండే శతజయంతి సందర్భంగా 1997లో ‘ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ’లో ఒక వ్యాసం రాసింది. అట్లాగే 2018లో ఆదిత్య సర్కార్‌ ‘ట్రబుల్‌ ఎట్‌ద మిల్‌’ పేరిట ఒక పుస్తకాన్ని వెలువరించిండు. అట్లా కొంచెం ఇతర ప్రాంత ప్రజలకు కూడా ఆయన గురించి తెలిసి వచ్చింది. అయినప్పటికీ సంప్రదాయ కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, సోషలిస్టులు ఎవ్వరూ ఆయన్ని ‘భారత కార్మికోద్యమ పితామహుడి’గా గుర్తించలేదు. కార్మికుల్లో ఎక్కువశాతం కింది కులాల వారే అయినప్పటికీ వారికి తమ ఆత్మ బంధువైన నారాయణ మేఘాజీ లొఖండే గురించి తెలియకుండా జేసిండ్రు. ఇది కచ్చితంగా కావాలని చేసిన విస్మరణే! ఈ చరిత్రను తిరగరాయాల్సిన అవసరముంది.

నారాయణ్‌ మేఘాజీ లొఖండె బంధుమిత్రుల సహాయంతో చదువుకున్నడు. కొన్ని రోజులు రైల్వే, పోస్టాఫీసుల్లో పనిజేసిండు. అయితే ఇవేవి ఆయనకు సంతృప్తినియ్యలేదు. దీనితో ఆయన బొంబాయిలోని మొరార్జీ గోకుల్‌ దాస్‌, హిందూస్థాన్‌, మాండ్వి బట్టల మిల్లుల్లో వివిధ హోదాల్లో పనిచేసిండు. (ఆదిత్య సర్కార్‌:2018) ఈ మిల్లుల్లో దళితులు కూడా పనిచేసేవారు. అయితే వారిని మిల్లులోని ఇతర విభాగాల్లోకి రానిచ్చేవారు కాదు. అంతేకాదు మిల్లు కార్మికులు మధ్యలో ఒక అర గంట భోజన విరామం మినహా దాదాపు 13-14 గంటు పనిచేసేవారు. ఇట్లా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న కార్మికుల అనారోగ్యం పాలు కావడాన్ని దగ్గర నుంచి చూసిండు. దళితుల పట్ల వివక్షనూ గమనించిండు. ఇదే సమయంలో బొంబాయిలో 1874లో రామయ్య వెంకయ్య అయ్యవారు, నర్సుజి తదితరులు ‘మాలి మహాసభ’ను నిర్వహించిండ్రు. ఇందులో జోతిరావు పూలే పాల్గొని ప్రసంగించిండు. (ధనంజయ కీర్‌: 1964) ఈ సభకు హాజరైన నారాయణ మేఘాజీ లొఖండే ఆనాటి నుంచి సత్యశోధక్‌ సమాజ్‌ కార్యకర్తగా, పూలె అనుయాయిగా మారిండు. ఇట్లా పూలెతో కలిసి ఎన్నో సత్యశోధక్‌ సమాజ్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. పూలె సూచనతో సత్యశోధక్‌ సమాజ్‌ పుట్టిన రోజు సెప్టెంబర్‌ 23 నాడు 1884లో ‘బొంబాయి మిల్‌ హ్యాండ్స్‌ అసోసియేషన్‌’ అనే కార్మిక సంఘాన్ని స్థాపించిండు. సెప్టెంబర్‌ 23 నాడు తిరిగి సెప్టెంబర్‌ 26 నాడు బొంబాయిలో భారీ బహిరంగ సభలు నిర్వహించిండు. ఈ సభల్లో ఐదువేలకు పైగా కార్మికులు పాల్గొన్నారు. ఇది బొంబాయిలో మొట్టమొదటి ప్రజా ప్రదర్శన, సభ. (ఆదిత్య సర్కార్‌: 2018).

లొఖండె బొంబాయి శాఖ ‘సత్యశోధక్‌ సమాజ్‌’ అధ్యక్షుడిగా కూడా ఉండేవాడు. దీంతో కార్మికుకులకు, సత్యశోధక్‌ సమాజ్‌కు మంచి స్నేహశీలత ఏర్పడింది. మార్వాడీల అప్పుల బారిన పడకుండా కార్మికులకు యాజమాన్యమే తక్కువ ధరకు నాణ్యమైన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేసిండు. ఈ కార్యక్రమాలు కార్మికులను ముఖ్యంగా బహుజనులను లొఖండేకు, సత్యశోధక్‌ సమాజ్‌కు మరింత దగ్గర చేశాయి.

1890లో ఆర్థిక మాంద్యం మూలంగా వారంలో రెండు రోజు మిల్లులను మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. అంటే నెలకు ఎనిమిది రోజుల జీతాన్ని కార్మికులు కోల్పోవాల్సి రావడంతో లొఖండే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీసిండు. 1890 ఏప్రిల్‌ 24 నాడు మహలక్ష్మి రేస్‌కోర్సు (బొంబాయి)లో పదివేల మందితో నిరసన ప్రదర్శనను నిర్వహించిండు.(నళిని:1997) దీంతో యాజమాన్యాలు దిగివచ్చాయి. ఇట్లా కొట్లాడి సాధించుకున్నదే ప్రతి ఆదివారం సెలవు. ఈ సెలవు మొట్టమొదటిసారిగా జూన్‌, 10, 1890 నాడు అమల్లోకి వచ్చింది. (నళిని:1997)

లొఖండే స్థాపించిన ‘బొంబాయి కామ్‌గార్‌ సంఘం’, దాని ఉద్యమాల మూలంగా మిల్‌ కార్మికులకు ప్రతి ఆదివారం సెలవు దొరికింది. సాయంత్రం పూట ఒక అరగంట విశ్రాంతి, ప్రతి మిల్లు ఉదయం ఆరున్నర నుంచి సూర్యస్తమయం వరకు మాత్రమే నడిపించాలి, ప్రతి కార్మికుడికి లుపదిహేనురోజులకోసారి జీతాలివ్వాలి, ఎవరైనా కార్మికుడు పనిచేస్తున్న క్రమంలో ప్రమాదంలో గాయపడితే అతను తిరిగి కోలుకునే వరకు పూర్తి జీతాలివ్వాలి’ అనే డిమాండ్లు సాధించుకున్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్మిక సంక్షేమ కమిటీల్లో కూడా ఈయన పనిచేసిండు. 1890లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఫ్యాక్టరీ కమిషన్‌’లో సభ్యుడిగా ఉన్నాడు. ఈయన చేసిన సూచనలను ప్రభుత్వం ఒప్పుకుంది లొఖండే కృషికి గుర్తింపుగా బ్రిటీష్‌ ప్రభుత్వం ‘రావుబహదూర్‌’ అనే బిరుదుని ప్రదానం చేసింది.

కార్మికోద్యమ నాయకుడిగా వివిధ మిల్లుల్లో సంస్థల్లో పనిచేసే కార్మికుల పిల్లలందరికీ ప్రభుత్వం ఉచితంగా విద్యనందించాలనీ, వీరు నివసించే ప్రదేశాల్లో మద్యనిషేధాన్ని అమలు చేయాలని, వెనుకబడిన వర్గాల వారికి ఉద్యోగాలు కల్పించాలని, విద్యార్థులకు ఫీజుల్లో రాయితీలు కల్పించాని ఆయన డిమాండ్‌ చేసిండు. అంతేగాకుండా సత్యశోధక్‌ సమాజ్‌ కార్యకలాపాలను విస్తరించే దిశలో బొంబాయిలో వితంతు పునర్వివాహాలకు మద్ధతుగా, వితంతు శిరోముండనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిండు. దీంతో బొంబాయిలో శిరోముండనానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు లండన్‌ లాంటి ప్రాంతాల నుంచి మహిళలు అభినందనలు చెబుతూ లేఖలు రాశారంటే దాని యొక్క విశిష్టత తెలుసుకోవచ్చు.

కార్మికోద్యమ నాయకుడిగా ఉంటూనే ఉద్యమావసరాల కోసం, అదే విధంగా సత్యశోధక్‌ సమాజ్‌ కార్యకలాపాలకు ప్రచారం కల్పించే ఉద్దేశ్యంతో అప్పటికి కష్టాల్లో నడుస్తున్న ‘దీనబంధు’ పత్రిక సంపాదకత్వ బాధ్యతలను చేపట్టిండు. ఈ పత్రికను మొదట 1877-80 మధ్య కాలంలో పుణె నుంచి సత్యశోధక్‌ సమాజ్‌ కార్యదర్శిగా పనిచేసిన కృష్ణారావు పాండురంగ్‌ భాలేకర్‌ నడిపించిండు. ఈయన కూడా మాలి. అయితే ఆర్థిక వనరుల లేమితో పత్రిక ఆగిపోవడంతో దాని కార్యస్థానాన్ని బొంబాయికి మార్చిండ్రు. బొంబాయిలో పత్రిక స్థాపనలోనూ, ముద్రణా యంత్రాన్ని కొనివ్వడంలోనూ హైదరాబాద్‌ రాజ్యం నుంచి బొంబాయి వలసబోయిన ప్రఖ్యాత కాంట్రాక్టర్లు రామయ్య వెంకయ్య అయ్యవారు, నర్సూ సాబ్‌, నాగు సాయజీ, జాయ కారడి లింగూ, వెంకూ బాలాజీ తదితరులు ఆర్థికంగా ఆదుకున్నారు. ఇట్లా స్థాపితమైన ‘దీనబంధు’ వార పత్రిక బొంబాయి నుంచి మే 1880 నుంచి 1897లో లొఖండే చనిపోయే వరకూ అంటే 17 ఏండ్ల పాటు నిరంతరాయంగా నడిచింది. కార్మికుల పక్షాన నిలబడింది. ఆర్థికంగా నష్టమొచ్చినా ఈ పత్రికను ఆయన నడిపించిండు. ఈ నష్టాలను మరో పూలే అనుయాయి ఎస్.ఆర్. లాడ్ ఎక్కువగా భరించిండు. అట్లాగే ‘గురఖి’ అనే దినపత్రికను కూడా లొఖండె నిర్వహించిండు.

1893లో తిలక్‌, ఆయన అనుయాయులు, ‘కేసరి’ పత్రిక మూలంగా బొంబాయిలో మొదటిసారిగా మతకహాలు జరిగాయి. ఈ మతకహాలను నివారించేందుకు, కార్మికుల మధ్యన సఖ్యత చేకూర్చేందుకు ఏర్పాటు చేసిన ‘శాంతి సంఘం’లో లొఖండే సభ్యుడిగా ఉన్నాడు. “ఏహ్య మేళ”ను నిర్వహించిండ్రు. మతసామరస్యానికి కృషి చేసిండు.

బొంబాయికి దగ్గరలోని థానెలో 1848 ఫిబ్రవరి ఎనిమిది నాడు ఈయన జన్మించిండు. కష్టనష్టాలకోర్చి చదువుకున్నాడు. బొంబాయిలో ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో 1874లో

పూలె అక్కడొక సభలో పాల్గొన్నాడు. ఆ సభలో పూలె ఉపన్యాసం విని ఆయన శిష్యుడిగా మారిండు. ఆయన నాయకత్వంలో వివిధ సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నాడు. అట్లాంటిదే శిరోముండనానికి వ్యతిరేకంగా పోరాటం. అలాగే రాయ్‌గఢ్‌లో శివాజీ సమాధిని రక్షించాలని, దానిని తీర్చిదిద్దాలని కూడా ఉద్యమాలు చేసిండు. పూలె అనుయాయిగా ఉంటూ పుణె జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో ‘సత్యశోధక్‌ సమాజ్‌’ కార్యకలాపాలు నిర్వహించడంలో చురుగ్గా పాల్గొన్నాడు.

భార్య గోపికాబాయి, కొడుకు పేరు గోపినాథ్‌. ఈయన స్మారకార్థం 2005 మే మూడు నాడు భారత ప్రభుత్వం పోస్టల్‌ స్టాంప్‌ని విడుద చేసింది.

ఇది కరోనా సమయం. అంటువ్యాధులు సోకుతున్నాయి. 1897లో మహారాష్ట్రలో కూడా ప్లేగు వ్యాధి సోకింది. ఇట్లా ప్లేగు వ్యాధి సోకిన వారికి సేవ చేస్తూ (నళిని: 1997) నారాయణ మేఘాజీ లొఖండే ప్లేగు పీడితులకు సేవ చేస్తూ 1898 ఫిబ్రవరి 9 నాడు చనిపోయిండు.

- సంగిశెట్టి శ్రీనివాస్‌
References:
(O’ Hanlan, Rosalind (2002) Caste, Conflict and Ideology: Mahatma Jotirao Phule and Low Caste Protest in Nineteenth Century Western India, Cambrdige University press, Cambridge.
keer,Dhananjay (1974) Mahatma Jotirao Phule: Father of Indian Social Revolution, Popular Prakashan, Bombay.
Pandit, Nalini (1997). "Narayan Meghaji Lokhande: The Father of Trade Union Movement in India". Economic and Political Weekly. 32 (7): 327–329.
Sarkar, Aditya (2018). Trouble at the Mill: Factory Law and the Emergence of the Labour Question in Late Nineteenth-Century Bombay. Oxford University Press, New Delhi.)

Vattikota natikalu